Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి
- Author : Vamsi Chowdary Korata
Date : 13-06-2026 - 3:29 IST
Published By : Hashtagu Telugu Desk
కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పాప మిస్సై ఐదురోజులైనా ఇప్పటి వరకూ ఆ పాప ఆచూకీ దొరకలేదు. పాపతో పాటు వెళ్లిన కుక్క మూడురోజుల తర్వాత తిరిగి రాగా.. ఆ కుక్క ద్వారా పాప ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి అడవిలోకి వదిలారు. మనుషులను చూసి కుక్క భయపడుతుండటంతో దానిని ఒక బోనులో ఉంచారు. మరోసారి అడవిలోకి పంపేందుకు ప్రయత్నించినా.. అందుకు కుక్క నిరాకరించడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. నిన్న.. పాప తల్లి కుక్కతో మాట్లాడుతూ.. జానును తీసుకువస్తావా అని అడుగుతున్న వీడియోలు నెటిజన్లను కదిలించాయి. ఈ కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క తాజాగా అనుమానాస్పద రీతిలో మరణించింది. దీంతో పోలీసులు పాప మిస్సింగ్, కుక్క మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజులపాటు విచిత్రంగా ప్రవర్తించిన కుక్క మరణించడంతో.. చిన్నారి జాహ్నవి ఆచూకీని కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. ఆ కుక్కను ఎవరైనా చంపేశారా? లేక జాహ్నవి ఆచూకీ కోసం అడవిలో ఎక్కువ దూరం పయనించడం వల్ల నీరసంతో చనిపోయిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.