పాత భవనాలకు “రుసుం”పై మాస్టర్ ప్లాన్
ఏపీ ప్రజలకు మరో భారీ షాక్ జగన్ సర్కార్ ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత భవనాలపై ఏ విధంగా రుసుం వసూలు చేయాలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
- By CS Rao Published Date - 04:08 PM, Tue - 30 November 21

ఏపీ ప్రజలకు మరో భారీ షాక్ జగన్ సర్కార్ ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత భవనాలపై ఏ విధంగా రుసుం వసూలు చేయాలో కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణాలు, నగరాలు, పట్టణ పంచాయతీల పరిధిలోని భవనాల వైపు చూస్తోంది. ఏ విధంగా..ఎంత మొత్తంలో రుసుంను వసూలు చేయవచ్చునో అధికారులు అధ్యయనం చేస్తున్నారు. రాబడి కోసం కొత్త మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.ఆ క్రమంలో 1994 నుంచి ఇప్పటివరకు ఏపీలో కట్టిన భవనాలపై రుసుం వసూలు చేయడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న భవనాలకు అసెస్మెంట్ నెంబరు ను మార్చే ప్రక్రియను తొలుత తీసుకు రావాలని జగన్ సర్కార్ భావిస్తుందట. ఆ సందర్భంగా దస్తావేజులు పరిశీలించి బిల్డింగ్ ప్లాన్ ను తీసుకోవాలని వాలంటీర్లకు అదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.
Also Read : ఏపీ సర్కార్ మరో పన్నుల బాదుడు?
ప్రతి అపార్ట్మెంట్కు ఒక ప్లాన్ సరిపోతుందని, ఇతర భవనాల వారికి B.A ప్లాన్ నెంబర్ తేదీ అడగాలని ఆదేశాలిచ్చినట్టు వాలంటీర్ల నుంచి సమాచారం అందుతోంది. ఇళ్లకు BPS సంఖ్య, తేదీ కావాలనుకుంటే ప్లాన్ యొక్క చిత్రాన్ని కూడా తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఆమోదించిన ప్లాన్ లేకపోతే భారీ పెనాల్టీ, ప్లాన్ లో ఉల్లంఘనలు ఉంటే జరిమానాలు వేయాలని ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మొత్తం మీద రాష్ట్ర ప్రజల నుంచి ఏదో ఒక రూపంలో ఆదాయం రాబట్టేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. అందుకోసం ఇప్పుడు పాత భవన నిర్మాణాల మీద దృష్టి పడింది. ఏ విధంగా వీటి ద్వారా రుసుములు వసూలు చేయనున్నారోనని ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.