CM Jagan Cabinet: జగన్ కొత్త మంత్రివర్గం ఫిక్స్?
ఏపీ సీఎం జగన్ మంత్రివర్గంలో భారీ మార్పులు చేయడానికి సిద్ధం అయ్యాడు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం 90శాతం మారే అవకాశం ఉంది.
- By CS Rao Published Date - 02:22 PM, Sat - 26 March 22
ఏపీ సీఎం జగన్ మంత్రివర్గంలో భారీ మార్పులు చేయడానికి సిద్ధం అయ్యాడు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం 90శాతం మారే అవకాశం ఉంది. ఒకరిద్దరు మినహా దాదాపుగా అందర్నీ మార్చేసే కసరత్తు జరుగుతోంది. ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఉంటుందని వైసీపీ వర్గాల్లోని చర్చ. స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో సహా భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవిని రోజాకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి సామాజిక, ప్రాంతీయ, సీనియార్టీ లాంటి సమీకరణాలు అడ్డుపడుతున్నాయని టాక్. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ను పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. స్పీకర్ గా కోన రఘుపతికి ఇస్తే, డిప్యూటీ స్పీకర్ పదవి రోజాను వరించనుందట. శ్రీకాకుళం జిల్లా నుంచి సీతారాంకు పోటీగా ధర్మాన కుటుంబం మంత్రివర్గంలో స్థానం కోసం పోటీ పడుతోంది. ప్రస్తుతం ధర్మాన క్రిష్ణందాస్ మంత్రిగా ఉన్నాడు. ఆయనకు బదులుగా ధర్మాన ప్రసాదరావుకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు జగన్ మీద ప్రసాదరావు చేశాడు. ఆ వ్యాఖ్యల కారణంగానే తొలి మంత్రివర్గంలో స్థానం లభించలేదని వినికిడి. ఇప్పుడు అవకాశం వస్తుందని తెలుస్తోంది.
పలు జిల్లాల నుంచి ఈసారి ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా ఉన్న గుంటూరు నుంచి మాచర్ల శాసన సభ్యుడు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా గెలుపొందాడు. వై.ఎస్ కుటుంబానికి విధేయుడు, వై.ఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనిమా చేసి జగన్ వెంటనడిచాడు. తొలి మంత్రివర్గంలో వివిధ రకాల ఈక్వేషన్ల కారణంగా స్థానం పొందలేని ఆయనకు ఈసారి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని అభిమానులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈసారి గుంటూరు జిల్లా నుండి డజనుకుపైగా నాయకులు రేసులో ఉన్నారు. వీరిలో కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్, ఆళ్ళ రామక్రిష్ణారెడ్డి, అంబటి రాంబాబు, రజిని , ముస్తఫా తదితరులు మంత్రివర్గంలో స్థానం కోసం చూస్తున్నారు. బి.సి సామాజక వర్గానికి చెందిన సీనియర్ నేత వై.ఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు యం.ఎల్.సి జంగా క్రిష్ణమూర్తి ఎప్పటి నుండో మంత్రి పదవిని ఆశిస్తున్నాడు. వై.ఎస్.ఆర్ సూచన మేరకు ఒక సారి మంత్రిపదవిని వదులుకున్నారని, ఇప్పుడు జగన్ మాటకోసం ఏకంగా గురజాల అసెంబ్లీ సీటునే త్యాగం చేశాడు. అందుకే, బి.సి నేత జంగా క్రిష్ణ మూర్తికి సముచితమైన గౌరవం ఇచ్చి శాసనమండలికి జగన్ ఎంపిక చేశాడు. సత్తెనపల్లి శాసన సభ్యుడు అంబటి రాంబాబు కు మొదటి నుండి జగన్ కు సన్నిహితుడిగా పేరుంది. కాపు సామాజిక వర్గానికి చెంది నేత కావడంతో ఆయనకు పదవిదక్కే ఛాన్స్ ఉందని అంచనా.
కాసు కుటుంబ రాజకీయవారసుడు గురజాల శాసన సభ్యుడు కాసు మహేష్ రెడ్డి తన తొలి ప్రయత్నంలోనే యరపతినేని శ్రీనివాసరావు లాంటి బలమైన నేతను ఓడించి జగన్ వద్ద మంచి మార్కులు సంపాదించాడు. ఆ కారణంగా మంత్రివర్గంలో చోటు వస్తుందని భావిస్తున్నాడు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఆమె గెలుపు కోసం సహకరించిన సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ తో పొసగడం లేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ మర్రి రాజశేఖర్ ను మండలికి పంపించి మంత్రిని కూడా చేస్తానంటూ సభాముఖంగా హామీఇచ్చాడు. ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటాడని రాజశేఖర్ అభిమానులు నమ్ముతున్నారు.
కర్నూలు జిల్లా నుంచి ఆర్థర్ (ఎస్పీ), బాలనాగి రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి. అనంపురం జిల్లా నుంచి ఉషాశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి, అనంత వెంకట్రామి రెడ్డి, కాపు రామచంద్రబారెడ్డి. కడప నుంచి శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, పార్థసారథి, జోగి రమేష్ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి కొండేటి చిట్టిబాబు(ఎస్సీ), పొన్నడా సతీశ్, జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు.
విశాఖ జిల్లా నుంచి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ మంత్రివర్గంలో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, శిల్పా చక్రపాణి రెడ్డి, గ్రంథి శ్రీనివాస్ రావు, ఆనం రామనారాయణ రెడ్డి, తలారి వెంకట్ రావు, కళావతి, ఉషశ్రీ చరణ్, కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొర, కేపీ పార్థసారథి, జోగి రమేష్, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తదితరులు క్యాబినెట్ బెర్తుల కోసం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నారు. కొందరు ప్రభుత్వం సలహాదారుగా ఉన్న సజ్జల రామక్రిష్ణా రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంకొందరు ఎంపీ సాయిరెడ్డి ద్వారా మంత్రి పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలోకి సజ్జల నుంచి తీసుకుంటే ఈక్వేషన్లు మారతాయని చాలా మంది భావిస్తున్నారు. కొత్త జిల్లాల సరిహద్దులను ఈనెల 29న ఫైనల్ చేస్తారు. వాటి ప్రాతిపదికన మంత్రుల ఎంపిక ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాను చేసిన జగన్ అదే ప్రాతిపదికన మంత్రుల ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ప్రాంతం, సామాజిక, జిల్లా ఈక్వేషన్లను తీసుకుని మంత్రివర్గం పునర్వవస్థీకరణ ఉంటుందని టాక్.
మొత్తం మీద జగన్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం తేదీ వచ్చే నెల 11 అంటూ వైసీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న క్యాబినెట్ 90శాతం మారుతుందని సంకేతాలున్నాయి. ఆ లెక్కన కనీసం 20 మంది కొత్తగా మంత్రివర్గంలో కనిపిస్తారని తెలుస్తోంది. సో..ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో చూడాలి.
Related News
Jagan : చండీయాగాన్ని పూర్తి చేసిన జగన్..మరోసారి సీఎం అయినట్లేనా..?
గత 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేపల్లి లోని తన ప్యాలెస్ లో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం చేస్తూ వచ్చారు