ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!
- Author : Vamsi Chowdary Korata
Date : 17-12-2025 - 3:24 IST
Published By : Hashtagu Telugu Desk
Bullet Railway : ఏపీ మీదుగా హైస్పీడ్ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందులో భాగంగా ఈ మార్గంలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో మంగళవారం భూ పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైల్వే లైన్ అనంతపురం జిల్లా మీదుగా వెళ్లే అవకాశం ఉండటంతో.. నిపుణులు పలుచోట్ల మట్టిని సేకరించి.. పరీక్షలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఏపీలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. దక్షిణాదిలో పెద్ద నగరాలైన హైదరాబాద్ – బెంగళూరు, అలాగే హైదరాబాద్ – చెన్నై నగరాల మధ్య బుల్లెట్ రైలు నడపాలని కేంద్రం భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఈ మార్గాల్లో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ – బెంగళూరు బుల్లెట్ రైల్వే లైన్ ఏపీలోని అనంతపురం జిల్లా మీదుగా వెళ్తుంది. అలాగే హైదరాబాద్ – చెన్నై బుల్లెట్ రైల్వే లైన్ గుంటూరు జిల్లా మీదుగా వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం అధికారులు కసరత్తు మొదలెట్టారు.
అందులో భాగంగా అనంతపురం జిల్లాలో పరీక్షలు నిర్వహించారు. హైస్పీడ్ రైల్నే లైన్ ఏర్పాటు కోసం భూసామర్థ్యాన్ని నిర్ధారించేందుకు అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రోజున మట్టి పరీక్షలు చేశారు. అనంతపురం రూరల్ మండలం, బుక్కరాయసముద్రం మండలంలోని కొన్ని గ్రామాలతో పాటుగా, సిద్దరాంపురం పరిసరాల్లో నిపుణుల బృందం మట్టి పరీక్షలు నిర్వహించింది. 40 పాయింట్ల వద్ద నుంచి మట్టి నమూనాలను సేకరించినట్లు సమాచారం.
మరోవైపు దక్షిణాదిలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతిలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ రైలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా కేంద్రానికి ప్రతిపాదిస్తున్నారు. ఈ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం సర్వే కూడా మొదలైందని ఇటీవల సీఎం చంద్రబాబు వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 2025లో భాగంగా చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. త్వరలోనే దక్షిణ భారతదేశానికి కూడా బుల్లె్ట్ రైలు వస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. సర్వే కూడా పూర్తైందని.. హైదరాబాద్, చెన్నై, అమరావతి, బెంగళూరును కలుపుతూ దీనిని ఏర్పాటు చేస్తారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈ నాలుగు నగరాల జనాభా కోట్లల్లో ఉందన్న చంద్రబాబు.. వీటిని అనుసంధానం చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్గా, అతిపెద్ద మార్కెట్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే బుల్లెట్ రైలు వస్తే దక్షిణాది ప్రాంత అభివృద్ధికి గేమ్ ఛేంజర్గా మారుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు మన దేశంలో తొలి బుల్లెట్ రైలును ముంబయి- అహ్మదాబాద్ మధ్య ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు ఏర్పాటు చేస్తే.. నాలుగు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని… వాణిజ్యం, వ్యాపారం. వర్తకం, సాంస్కృతిక, పర్యాటకంగా నాలుగు ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ.