అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం
వైట్ హౌస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త ఆంక్షలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి. బలహీనమైన వీసా తనిఖీ వ్యవస్థలు, వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం, ఉగ్రవాద కార్యకలాపాల ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- Author : Gopichand
Date : 17-12-2025 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరె సంచలన నిర్ణయం
- ఆ ఏడు దేశాలపై పూర్తి నిషేధం
America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిహద్దు భద్రత విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం (డిసెంబర్ 16, 2025) నాడు ఏడు అదనపు దేశాలతో పాటు పాలస్తీనియన్లపై పూర్తి ప్రయాణ నిషేధాన్ని విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు మరో 15 దేశాల పౌరుల ప్రవేశంపై పాక్షిక ఆంక్షలు విధించారు. తాజా నిర్ణయంతో అమెరికా ప్రయాణ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల సంఖ్య 39కి చేరింది.
జనవరి 1 నుండి అమలు
వైట్ హౌస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఈ కొత్త ఆంక్షలు జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తాయి. బలహీనమైన వీసా తనిఖీ వ్యవస్థలు, వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం, ఉగ్రవాద కార్యకలాపాల ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read: సరికొత్త రికార్డు..85,000 కోట్ల మార్కెట్ క్యాప్ ని టచ్ చేసిన మీషో!
పూర్తి నిషేధం విధించిన 7 దేశాలు
కొత్త ప్రకటన ప్రకారం ఈ క్రింది దేశాలపై పూర్తి ప్రయాణ నిషేధం ఉంటుంది.
- బుర్కినా ఫాసో
- మాలి
- నైజర్
- దక్షిణ సూడాన్
- సిరియా
- లావోస్ (గతంలో పాక్షిక నిషేధం, ఇప్పుడు పూర్తి నిషేధం)
- సియెర్రా లియోన్ (గతంలో పాక్షిక నిషేధం, ఇప్పుడు పూర్తి నిషేధం)
వీరికి తోడు పాలస్తీనియన్ అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు కలిగిన పాలస్తీనియన్లపై కూడా నిషేధం విధించారు.
15 దేశాలపై పాక్షిక ఆంక్షలు
అంగోలా, యాంటిగ్వా, బార్బుడా, బెనిన్, కోట్ డి ఐవరీ, డొమినికా, గాబన్, ది గాంబియా, మలావి, మౌరిటానియా, నైజీరియా, సెనెగల్, టాంజానియా, టోంగా, జాంబియా, జింబాబ్వే దేశాల పౌరులపై పాక్షిక ఆంక్షలు విధించారు. అయితే, తుర్క్మెనిస్తాన్ పౌరులకు నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ స్వల్ప ఉపశమనం కల్పించారు.
నిషేధానికి కారణాలు
ఇటీవల అమెరికా సైనికులపై జరిగిన దాడులు ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
నవంబర్ 26: వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులను ఒక ఆఫ్ఘన్ పౌరుడు హత్య చేశాడు.
డిసెంబర్ 13: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన దాడిలో ఇద్దరు అమెరికన్ సైనికులు, ఒక అనువాదకుడు మరణించారు.
ఉగ్రవాద ముప్పులు, సిరియా వంటి దేశాల్లో సరైన పాస్పోర్ట్ జారీ చేసే వ్యవస్థలు లేకపోవడాన్ని ప్రభుత్వం సాకుగా చూపింది.
మినహాయింపులు ఎవరికి?
- కొత్త నిబంధనల నుండి ఈ క్రింది వారికి మినహాయింపు లభిస్తుంది.
- అమెరికా శాశ్వత నివాసితులు (గ్రీన్ కార్డ్ హోల్డర్లు).
- ఇప్పటికే చెల్లుబాటు అయ్యే వీసా కలిగిన వారు.
- దౌత్యవేత్తలు.
- క్రీడాకారులు, అమెరికా జాతీయ ప్రయోజనాల కోసం ప్రవేశించే వ్యక్తులు.
- అయితే కుటుంబ ఆధారిత వీసా మినహాయింపులను మాత్రం భారీగా తగ్గించారు.