సీజ్ఫైర్పై నీలినీడలు?
పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్తో ఒప్పందం కుదిరితే సంతకం చేయడానికి తానే స్వయంగా ఇస్లామాబాద్ వస్తానని ఒక పెద్ద ప్రకటన చేశారు.
- Author : Gopi
Date : 19-04-2026 - 10:18 IST
Published By : Hashtagu Telugu Desk
Ceasefire Deadline: అమెరికా- ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ మరోసారి కీలక దౌత్య కేంద్రంగా మారింది. వచ్చే వారం ఇరు దేశాల మధ్య రెండో విడత రహస్య చర్చలు జరిగే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్లో అమెరికన్ సైనిక విమానాలు ల్యాండ్ అవ్వడం, రెడ్ జోన్ రహదారులను మూసివేయడం వంటి పరిణామాలు ఏదో పెద్ద మిషన్ జరుగుతోందనడానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నగరంలోని ప్రముఖ హోటళ్లను ఖాళీ చేయించి, అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
సీజ్ఫైర్పై నీలినీడలు?
ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా అమలులో ఉన్న కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఏప్రిల్ 21తో ముగియనుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. మొదటి విడతలో జరిగిన 21 గంటల సుదీర్ఘ చర్చల్లో ఎటువంటి స్పష్టమైన ఫలితం రానప్పటికీ యుద్ధం మళ్లీ ప్రారంభం కాకుండా చూడాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీజ్ఫైర్ను పొడిగించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కానీ ఏదైనా పెద్ద ఒప్పందం కుదిరితే తానే స్వయంగా ఇస్లామాబాద్కు వస్తానని సంకేతాలిచ్చారు. ఏప్రిల్ 24 (శుక్రవారం) లోపు తుపాకులు శాంతిస్తాయా లేదా మళ్లీ మోత మొదలవుతుందా అనేది తేలనుంది.
Also Read: టీమిండియా ఖాతాలో మరో ఓటమి!
పాకిస్థాన్- మధ్యవర్తుల పాత్ర
ఈ మొత్తం పరిణామాల్లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఆయన ఇటీవల ఇరాన్లో పర్యటించి శాంతి కోసం విజ్ఞప్తి చేశారు. ‘అల్ జజీరా’ నివేదిక ప్రకారం.. అమెరికా- ఇరాన్ ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఒక అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ కూడా వాతావరణాన్ని చల్లబరిచేందుకు హోర్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తెరిచింది, ఇది చర్చల దిశగా ఒక సానుకూల అడుగుగా భావిస్తున్నారు. ప్రపంచంలోని ఇద్దరు పెద్ద శత్రువులను ఒకే టేబుల్ మీదకు తీసుకురావడానికి పాకిస్థాన్ తన శక్తినంతా ఒడ్డుతోంది.
ట్రంప్ స్వయంగా పాకిస్థాన్కు వస్తారా?
పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్తో ఒప్పందం కుదిరితే సంతకం చేయడానికి తానే స్వయంగా ఇస్లామాబాద్ వస్తానని ఒక పెద్ద ప్రకటన చేశారు. అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందాలతో పాటు అంతర్జాతీయ మీడియా కోసం పాకిస్థాన్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ అధికారిక చర్చలు ఒప్పందంతో ముగుస్తాయా లేదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే మధ్యప్రాచ్యంలో యుద్ధం మళ్లీ ముదురుతుందిజ. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుంది.