ట్రంప్కు షాక్ ఇచ్చిన ఇరాన్.. ఏకంగా 1.1 బిలియన్ డాలర్లు నష్టం
- Author : Vamsi Chowdary Korata
Date : 05-03-2026 - 12:52 IST
Published By : Hashtagu Telugu Desk
Iran Destroys Us Billion Dollar Radar ఇజ్రాయెల్-అమెరికా బలగాలు తనపై విరుచుకుపడుతోన్న వేళ.. ఇరాన్ సైతం గట్టిగానే ప్రతిఘటిస్తోంది. తక్కువ వ్యయంతో రూపొందించిన డ్రోన్లు, క్షిపణులతో దాడి చేస్తున్న ఇరాన్.. తన శత్రువుకు ఎక్కువ నష్టం వాటిల్లేలా చేస్తోంది. ఈ వ్యూహంలోనే భాగంగా ఖతార్లో అమెరికా ఏర్పాటు చేసిన కీలకమైన బాలిస్టిక్ మిసైల్ రాడార్ వ్యవస్థపైనా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఉపగ్రహ చిత్రాలు సైతం అమెరికా రాడార్ వ్యవస్థపై ఇరాన్ దాడి జరిపిన విషయం నిజమేనని చెబుతున్నాయి.
ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా అధునాతన బాంబర్లు, క్షిపణులు, స్టెల్త్ ఫైటర్లను ప్రయోగిస్తూ శత్రువును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఇరాన్ సైతం తగ్గడం లేదు. తమ సుప్రీం పాలకుడు మరణించినప్పటికీ, తన దగ్గర ఆయుధ సంపత్తి తక్కువగా ఉన్నప్పటికీ, టెహ్రాన్ వ్యూహాత్మక పోరాటం చేస్తోంది. చిన్న ఆయుధాలతోనే అమెరికా, దాని మిత్ర పక్షాలకు చెందిన అత్యంత విలువైన ఆస్తులపై దాడులు చేస్తూ.. వాటికి ఎక్కువ నష్టం జరిగేలా ప్లాన్ చేస్తోంది. తక్కువ ఖర్చుతో రూపొందించిన షహీద్ డ్రోన్లతో దాడులు చేస్తున్న ఇరాన్.. శత్రువు ఆయుధ నిల్వలు తరిగిపోయేలా యుద్ధతంత్రం నడుపుతోంది.
ఇప్పటికే సౌదీలోని ఆరామ్కో ఆయిల్ రిఫైనరీతోపాటు.. దుబాయ్, బహ్రెయిన్ ఎయిర్పోర్టులపై ఇరాన్ దాడి చేసింది. హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతోపాటు.. చమురును తీసుకెళ్లే నౌకలపైనా దాడులు చేస్తోంది. ఖతార్లో అమెరికా ఏర్పాటు చేసిన, అత్యంత కీలకమైన ఎర్లీ వార్నింగ్ రాడార్ సిస్టమ్ను సైతం ఇరాన్ దెబ్బతీసింది. 1.1 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.10 వేల కోట్లు) విలువైన ఈ రాడార్ సిస్టమ్.. ముందుగానే శత్రువు మిసైల్ దాడులను పసిగట్టగలదు. దాన్ని దెబ్బతీయడం ద్వారా గల్ఫ్ ప్రాంతంలో అమెరికా బలగాలను ఇరాన్ గట్టిగా దెబ్బతీసిందనే భావన వ్యక్తమవుతోంది. శత్రువు నుంచి వచ్చే క్షిపణి దాడులను ముందే గుర్తించడం అమెరికాకు కష్టం అయ్యే అవకాశం ఉంది.
ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న AN/FPS-13 రాడార్ వ్యవస్థ.. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా నిర్వహిస్తోన్న అతిపెద్ద బాలిస్టిక్ మిసైల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ప్లానెట్ ల్యాబ్స్ సేకరించిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే.. అమెరికా సైనిక బలగాలకు నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది.
ఈ దాడులను అత్యంత కచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులు (ప్రిసిషన్ మిస్సైల్ స్ట్రైక్)గా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) అభివర్ణించింది. అయితే ఇరాన్ తక్కువ వ్యయంతో, డ్రోన్తో ఈ దాడులు చేసిందని.. బహుశా షహీద్ తరహా డ్రోన్లతో శత్రువు రక్షణ వ్యవస్థను దెబ్బతీసిందని ఇతర వర్గాలు భావిస్తున్నాయి.
అప్గ్రేడెడ్ ఎర్లీ వార్నింగ్ రాడార్ ప్రోగ్రామ్లో భాగంగా అమెరికా ఈ రాడార్ వ్యవస్థను నిర్మించింది. బాలిస్టిక్ మిస్సైళ్లతోపాటు గగన తలంలో దూసుకొని వచ్చే ఇతర ముప్పును 5000 కిలోమీటర్ల దూరం నుంచే ఈ రాడార్ వ్యవస్థ పసిగట్టి అప్రమత్తం చేయగలదు. పశ్చిమాసియా వ్యాప్తంగా ఇది ముందస్తు హెచ్చరికలు జారీ చేయగలదు. ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీతోపాటు మధ్య ఆసియాలోని ప్రాంతాలు, హిందూ మహా సముద్రాన్ని కవర్ చేయడానికి వీలుగా అమెరికా ఈ రాడార్ వ్యవస్థను ఖతార్లో ఏర్పాటు చేసింది.
సుదీర్ఘ రేంజ్ కారణంగా.. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలో ఈ రాడార్ కీలకంగా మారింది. థాడ్, పాట్రియాట్ మిస్సైల్ డిఫెన్స్ బ్యాటరీలతోపాటు ఏజిస్ సిస్టమ్ ఉన్న యుద్ధ నౌకలతో దీన్ని అనుసంధానం చేశారు. శత్రుదేశాల మిసైల్ లాంచ్లను చాలా వేగంగా గుర్తించి.. రక్షణ వ్యవస్థను వెంటనే అప్రమత్తం చేస్తుంది. దీని వల్ల శత్రు క్షిపణి దాడులను తిప్పికొట్టడం అమెరికాకు సులభంగా మారింది.
ఇరాన్ దాడిలో రాడార్ వ్యవస్థ దెబ్బతినడం పట్ల అమెరికా రిటైర్డ్ ఆర్మీ కల్నల్, పెంటగాన్ మాజీ సలహాదారు డౌగ్లస్ మెక్గ్రేగర్ తీవ్రంగా స్పందించారు. రాడార్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల తమ కంటి చూపు పోయినంత పనైందని ఆయన వ్యాఖ్యానించారు.
రాడార్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైన్యం పర్యవసానాలను ఎదుర్కోవాల్సి రావచ్చని జియోపాలిటిక్స్ నిపుణుడైన బ్రియాన్ అలెన్ అంచనా వేశారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిసైల్ డిఫెన్స్కు ఇది వెన్నెముకలాంటిదని.. అమెరికా రక్షణ వ్యవస్థ నెట్వర్క్లో కొంత భాగం.. గుడ్డిగా పని చేయాల్సి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఆధునిక యుద్ధంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా కీలకం. ప్రతి ముప్పును తిప్పికొట్టాలి, లేకపోతే దుర్లభమైన లక్ష్యాలను దెబ్బతీయడానికి శత్రువుకు ఒక్క మిసైల్ సరిపోతుంది’ అని బ్రియాన్ హెచ్చరించారు.
శాటిలైట్లు, ఇతర రాడార్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా సెన్సార్ల నెట్వర్క్ను అమెరికా నిర్వహిస్తుంది. అయితే AN/FPS-132 లాంటి వ్యూహాత్మక వ్యవస్థలు దెబ్బతినడం లేదా నాశనం కావడం వల్ల ప్రాంతీయంగా కొంత గ్యాప్ ఏర్పడుతుందని మిలటరీ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ‘అలాంటి పెద్ద రాడార్లను వేగంగా భర్తీ చేయడం కష్టంతో కూడుకున్న పని. రాడార్ వ్యవస్థకు ఏమాత్రం డ్యామేజ్ జరిగినా ఈ ప్రాంతంలో నిఘాను, మిసైల్ ట్రాకింగ్ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది’ అని మిలిటరీ అనలిస్టులు చెబుతున్నారు.
ఆర్థిక పరంగా చూస్తే.. దెబ్బతిన్న రాడార్ చాలా ఖరీదైనది. యుద్ధం ప్రారంభ దశలో ఈ రాడార్ దెబ్బతినడం వల్ల.. థాడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, పాట్రియాట్ మిసైల్ సిస్టమ్లతో కోఆర్డినేషన్ విషయంలో ఇబ్బందులు తలెత్తొచ్చు. ఈ రాడార్ సిస్టమ్ ఇచ్చే డేటాపై ఆధారంగా ఇవి పని చేస్తాయి. కీలకమైన రాడర్ వ్యవస్థపై దాడి చేయడం వల్ల.. అమెరికాకు చెందిన కీలకమైన క్షిపణి రక్షణ వ్యవస్థ భాగాలను సైతం తాము టార్గెట్ చేయగలమని ఇరాన్ నిరూపించింది. ఈ దాడి ఫలితంగా పశ్చిమాసియాలో నిఘా పరికరాల మోహరింపులో మార్పులొచ్చే అవకాశం ఉంది.