Cyber Attacks : ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ సైబర్ దాడులతో కలకలం
ఇరాన్లోని అణు స్థావరాలు, చమురు సరఫరా చేసే నెట్వర్క్లు, ఇంధన సప్లై వ్యవస్థలు, మున్సిపల్ విభాగాల నెట్వర్క్లు, రవాణా విభాగాల నెట్వర్క్లపైనా సైబర్ దాడులు (Cyber Attacks) జరిగాయని సమాచారం.
- By Pasha Published Date - 01:24 PM, Sat - 12 October 24

Cyber Attacks : ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్లోని న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖల ఆన్లైన్ పోర్టల్స్పై సైబర్ దాడులకు తెగబడింది. దీంతో ఆయా సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక ఇరాన్లోని అణు స్థావరాలు, చమురు సరఫరా చేసే నెట్వర్క్లు, ఇంధన సప్లై వ్యవస్థలు, మున్సిపల్ విభాగాల నెట్వర్క్లు, రవాణా విభాగాల నెట్వర్క్లపైనా సైబర్ దాడులు (Cyber Attacks) జరిగాయని సమాచారం. ఆయా నెట్వర్క్ల నుంచి కొంత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించారని తెలుస్తోంది. ఈమేరకు ఇరాన్ మీడియాలో సంచలన కథనాలు ప్రసారమయ్యాయి. అయితే ఇరాన్పై వైమానిక దాడి చేయడానికి ముందు ఉద్దేశపూర్వకంగానే.. ఈ సైబర్ దాడికి ఇజ్రాయెల్ పాల్పడి ఉండొచ్చని అంటున్నారు. ఈ సైబర్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై సైబర్ ఎటాక్స్కు ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇరాన్ వద్ద కూడా మంచి సైబర్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read :RSS Chief : జాతీయ భాషపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ఇటీవలే లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. దీంతో రగిలిపోయిన ఇరాన్ ఐదారు రోజుల తర్వాత ఇజ్రాయెల్పై ఏకంగా 400 మిస్సైళ్లతో వైమానిక దాడి చేసింది. వీటిలో 200 మిస్సైళ్లను మార్గం మధ్యలోని సముద్ర ప్రాంతంలోనే అమెరికా నౌకాదళం కూల్చేసింది. మిగిలిన 200 మిస్సైళ్లు వెళ్లి ఇజ్రాయెల్లోని వివిధ నగరాలపై పడ్డాయి. దీంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా ఆ సమాచారాన్ని బయటికి వెల్లడించలేదని సమాచారం. కనీసం ఈ దాడుల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా చూపించకుండా ఇజ్రాయెల్లో మీడియాపై కఠినమైన సెన్సార్ షిప్ను అమలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో త్వరలోనే ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి తొలి సంకేతంగానే ఇప్పుడు సైబర్ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.