చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!
- Author : Vamsi Chowdary Korata
Date : 17-02-2026 - 12:20 IST
Published By : Hashtagu Telugu Desk
New Jersey అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టడమే కాకుండా అక్కడ పసిపిల్లలపై పైశాచికత్వం ప్రదర్శించిన ఓ భారతీయుడి ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓడెల యశస్వీ కొత్తపల్లి అనే యువకుడిని అధికారులు కటకటాల్లోకి నెట్టారు. అంతేకాకుండా జైలుకు పంపడమే కాకుండా తిరిగి భారత్కు బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.
అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారతీయ పౌరుడు అత్యంత హేయమైన నేరానికి పాల్పడి చిక్కుల్లో పడ్డాడు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత్కు చెందిన ఓడెల యశస్వీ కొత్తపల్లి అనే వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఉన్న తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో అతడిని అమెరికా నుంచి శాశ్వతంగా బహిష్కరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
అసలేం జరిగిందంటే..?
అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు యశస్వీ కొత్తపల్లి న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులను లైంగికంగా వేధించినట్లు బలమైన ఆధారాలు లభించాయి. ఈ మేరకు అతడిపై తీవ్రమైన లైంగిక దాడి అభియోగాలు నమోదు అయ్యాయి. అంతేకాకుండా విచారణలో మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా బయట పడ్డాయి. ముఖ్యంగా నిందితుడు ఎలాంటి సరైన వీసా పత్రాలు లేకుండా దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశించినట్లు తేలింది. కేవలం లైంగిక వేధింపులే కాకుండా.. దొంగతనాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి ఇతర నేరాలతోనూ అతడికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
బహిష్కరణకు రంగం సిద్ధం..
నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు.. అతడిని అమెరికా నుంచి శాశ్వతంగా పంపించివేసేందుకు న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రస్తుతానికి నిందితుడు ఎక్కడ అరెస్ట్ అయ్యాడనే వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ.. దర్యాప్తు కొనసాగుతోందని ఐసీఈ (ICE) స్పష్టం చేసింది. అమెరికా చట్టాల ప్రకారం చిన్నారిపై లైంగిక దాడి అనేది అత్యంత తీవ్రమైన నేరం కావడంతో.. అతడికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.
అక్రమ వలసదారులపై పెరుగుతున్న వేటు
గత కొంతకాలంగా సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశిస్తున్న భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో అగ్రరాజ్యం కూడా అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే దాదాపు 3,800 మంది భారత పౌరులను అమెరికా అధికారులు స్వదేశానికి తిప్పి పంపించారు. తాజాగా యశస్వీ కొత్తపల్లి కేసు కూడా ఈ జాబితాలో చేరనుంది.