అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!
డిసెంబర్ 1, 2025న రికార్డ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో నికోలస్ మదురో అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. వెనిజులాలో ప్రభుత్వం మార్చడం ద్వారా అక్కడి అపారమైన చమురు నిల్వలను హస్తగతం చేసుకోవాలని అమెరికా చూస్తోందని ఆయన ఆరోపించారు.
- Author : Gopichand
Date : 03-01-2026 - 3:58 IST
Published By : Hashtagu Telugu Desk
Donald Trump: అమెరికా- వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. శనివారం (3 జనవరి 2026) ఉదయం వెనిజులా రాజధాని కారకాస్ వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. తమ దేశ పౌర, సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిందని వెనిజులా ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య ప్రస్తుతం అమెరికా అదుపులో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
మదురో దంపతులు మా ఆధీనంలో ఉన్నారు: ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “వెనిజులా, ఆ దేశ నేత నికోలస్ మదురోకు వ్యతిరేకంగా అమెరికా భారీ స్థాయి ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించింది. నికోలస్ మదురో, ఆయన భార్యను పట్టుకుని, దేశం వెలుపలికి తరలించడం జరిగింది. అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడిస్తాం” అని పేర్కొన్నారు.
Also Read: బాలకృష్ణ అభిమానులకు భారీ షాక్
గ్రౌండ్ ఆపరేషన్పై ట్రంప్ ముందస్తు హెచ్చరికలు
నికోలస్ మదురోను అధికార పీఠం నుంచి తొలగించే వ్యూహంలో భాగంగా వెనిజులాలో నేరుగా సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే కారకాస్లో పేలుళ్లు సంభవించడం గమనార్హం. మదురోపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇప్పటికే వెనిజులాపై ఆంక్షలను కఠినతరం చేసింది. అంతేకాకుండా కరేబియన్, పసిఫిక్ ప్రాంతాల్లో అమెరికా నౌకాదళం ఉనికిని పెంచుతూ డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలతో వెనిజులాను చుట్టుముట్టింది.
చమురు నిల్వల కోసమే అమెరికా కుట్ర: మదురో
డిసెంబర్ 1, 2025న రికార్డ్ చేసిన ఒక ఇంటర్వ్యూలో నికోలస్ మదురో అమెరికాపై తీవ్ర విమర్శలు చేశారు. వెనిజులాలో ప్రభుత్వం మార్చడం ద్వారా అక్కడి అపారమైన చమురు నిల్వలను హస్తగతం చేసుకోవాలని అమెరికా చూస్తోందని ఆయన ఆరోపించారు. ఆగస్టులో కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా సైన్యాన్ని మోహరించడంతోనే ఈ ఒత్తిడి పర్వం మొదలైందని ఆయన అప్పట్లోనే హెచ్చరించారు.
అమెరికా పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ
పరిస్థితి విషమించడంతో అమెరికా ప్రభుత్వం తన పౌరులకు కీలక సూచనలు చేసింది. వెనిజులాకు ప్రయాణించవద్దని, అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. అకారణంగా నిర్బంధించడం, హింసించడం, కిడ్నాప్లు, స్థానిక చట్టాలను తప్పుగా ఉపయోగించి వేధించే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది.