Sheikh Hasina : షేక్ హసీనాపై బంగ్లాదేశ్ అరెస్టు వారెంట్.. భారత్ ఏం చేయబోతోంది ?
ఇప్పటికే షేక్ హసీనా దౌత్య పాస్పోర్టును బంగ్లాదేశ్ (Sheikh Hasina) రద్దు చేసింది.
- By Pasha Published Date - 03:30 PM, Thu - 17 October 24

Sheikh Hasina : ఢిల్లీలో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు షాక్ ఇచ్చే వార్త ఇది. బంగ్లాదేశ్కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ (ఐసీటీ) కీలక ఆదేశాలు ఇచ్చింది. షేక్ హసీనాపై అరెస్టు వారెంటును జారీ చేసింది. నవంబరు 18లోగా హసీనాను అరెస్టు చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఆర్డర్ ఇచ్చింది. ఈమేరకు ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం సంచలన తీర్పును వెలువరించారు.
Also Read :Iran Vs Israel : మాపై దాడి చేస్తే.. ఇజ్రాయెల్ బాధపడాల్సి ఉంటుంది : ఇరాన్
స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బంగ్లాదేశ్లోని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. ఈక్రమంలో జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు, భద్రతా దళాలు పలుమార్లు, వేర్వేరుచోట్ల విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డాయి. హసీనా ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ కాల్పులు జరిగాయని అంటున్నారు. విద్యార్థి సంఘాల నేతలు, నిరసనకారులపై షేక్ హసీనా రాజకీయ పార్టీ నాయకులు కూడా దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనల్లో చనిపోయిన, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలు బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. ఈవిధంగా వచ్చిన దాదాపు 60కిపైగా పిటిషన్లను విచారించిన ట్రిబ్యునల్.. ఇంతమంది వేదనకు కారకురాలు అయినందున మాజీ ప్రధాని షేక్ హసీనాను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read :Diwali 2024 : అక్టోబరు 31 వర్సెస్ నవంబరు 1.. దీపావళి పండుగ తేదీపై గందరగోళం
ప్రస్తుతం హసీనా ఢిల్లీలో ఉన్నారు. అరెస్టు వారెంటు విషయంపై భారత్ను బంగ్లాదేశ్ ఎలా సంప్రదిస్తుంది ? హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించే విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే షేక్ హసీనా దౌత్య పాస్పోర్టును బంగ్లాదేశ్ (Sheikh Hasina) రద్దు చేసింది. హసీనా రాజకీయ పార్టీ కీలక నేతల దౌత్య పాస్పోర్టులను కూడా రద్దు చేశారు. దౌత్య పాస్పోర్టు ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కలిగినవారు వీసా లేకుండానే కొన్ని దేశాలకు నేరుగా వెళ్లొచ్చు.