Paramilitary Attack : పారామిలిటరీ రాక్షసత్వం.. దాడిలో 80 మంది సామాన్యులు మృతి
సెంట్రల్ సూడాన్లోని సిన్నర్ ప్రాంతంలో ఉన్న జలక్ని గ్రామంలో ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు యత్నించాయి.
- Author : Pasha
Date : 17-08-2024 - 12:18 IST
Published By : Hashtagu Telugu Desk
Paramilitary Attack : సూడాన్ దేశంలో అంతర్యుద్ధం తీవ్రరూపు దాలుస్తోంది. తాజాగా ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్) అనే సూడాన్ పారామిలిటరీ బలగాలు జరిపిన దాడిలో దాదాపు 80 మంది సామాన్య పౌరులు చనిపోయారు. సెంట్రల్ సూడాన్లోని సిన్నర్ ప్రాంతంలో ఉన్న జలక్ని గ్రామంలో ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు యత్నించాయి. అయితే దీన్ని స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈక్రమంలోనే ఆర్ఎస్ఎఫ్ బలగాలు తుపాకులతో కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అక్కడున్న వారిలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఘటనపై ఆర్ఎస్ఎఫ్(Paramilitary Attack) ఇంకా స్పందించలేదు. ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు. దాడికి గల కారణాలను తనవైపు నుంచి వెల్లడించలేదు.పారా మిలటరీ దాడిపై సిన్నర్ ప్రాంత యువత తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ఆర్ఎస్ఎఫ్ బలగాల ఆగడాలు మితిమీరాయని, ప్రజలను దారుణంగా వేధిస్తున్నారని వారు మండిపడుతున్నారు. గత జూన్ నుంచి ఆర్ఎస్ఎఫ్ బలగాల నియంత్రణలోనే సిన్నర్ ప్రాంతం ఉంది. ఆ బలగాల దాడులు, వేధింపులను తాళలేక ఇప్పటివరకు(గత మూడు నెలల్లో) దాదాపు 7.25 లక్షల మంది అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.
Also Read :Electricity Bills : ఫోన్ పేలో కరెంటు బిల్లులు కట్టేయండి.. త్వరలోనే అమెజాన్ పే, గూగుల్ పేలోనూ సేవలు!
అసలు విషయం ఏమిటంటే.. సూడాన్లో ఆర్మీ, భద్రతా బలగాలు ఏకతాటిపై లేవు. అవన్నీ ఒకే కమాండ్ కంట్రోల్ కింద పనిచేయడం లేదు. సూడాన్ ఆర్మీకి, పారామిలిటరీ బలగం సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో ఈ మూడు ప్రభుత్వ సాయుధ సంస్థలు వేటికవిగా స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. వేటి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను అవి పాలిస్తూ దురాగతాలకు పాల్పడుతున్నాయి. ఈపరిస్థితుల వల్ల గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సూడాన్లో దాదాపు 16,650 మంది ప్రాణాలు కోల్పోయారు. కోటి మందికి పైగా సూడాన్ను ఇతర దేశాలకు వలస వెళ్లారు.