HYD : దేవుడు బతికిస్తాడని..శవాన్ని ఇంట్లో పెట్టి పూజలు !! ఇదెక్కడి మూఢనమ్మకం !
నాలుగు రోజులు గడవడంతో మృతదేహం కుళ్లిపోయి అపార్ట్మెంట్ అంతా భరించలేని దుర్వాసన రావడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది
- Author : Sudheer
Date : 17-02-2026 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచం పరుగులు తీస్తున్నా, మానవ మేధస్సు శిఖరాగ్రాలకు చేరుతున్నా.. సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు ఇంకా విస్మయానికి గురిచేస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని కూకట్పల్లిలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. చనిపోయిన వ్యక్తిని దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడనే గుడ్డి నమ్మకంతో, ఒక కుటుంబం ఏకంగా నాలుగు రోజుల పాటు శవంతో గడిపిన తీరు చూస్తుంటే.. భక్తికి, మూఢత్వానికి మధ్య ఉన్న గీత చెరిగిపోతోందా అనే అనుమానం కలుగుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లిలోని ఒక అపార్ట్మెంట్లో నివసించే శైలజ (43) అనారోగ్యంతో మృతి చెందింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఏసుప్రభువు వచ్చి శైలజను మళ్ళీ బ్రతికిస్తాడనే అచంచల విశ్వాసంతో ఆమె తల్లి శమంతకమణి, తోబుట్టువులు జయరాం, సునీతలు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆ శవం ముందే ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ కూర్చున్నారు. బయట ప్రపంచానికి తెలియకుండా తలుపులు మూసి భక్తి పేరుతో వారు చేసిన ఈ సాహసం అటు పోలీసులను, ఇటు స్థానికులను అవాక్కయ్యేలా చేసింది.
నాలుగు రోజులు గడవడంతో మృతదేహం కుళ్లిపోయి అపార్ట్మెంట్ అంతా భరించలేని దుర్వాసన రావడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మానవతా దృక్పథంతో అంత్యక్రియలు నిర్వహించాలని స్థానికులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఆ కుటుంబ సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు. ‘మా దేవుడు మా బిడ్డను బ్రతికిస్తాడు, మీకేంటి అభ్యంతరం’ అంటూ గొడవకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి బలవంతంగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శైలజ మృతదేహాన్ని వారి స్వగ్రామమైన ఏపీలోని కైకలూరుకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేయించారు.