Chhattisgarh Encounter : మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా : ప్రధాని మోడీ
ఈ ఘటన మావోయిజం నిర్మూలనలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు భద్రతా వర్గాలు. ఈ ఆపరేషన్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. భద్రతా బలగాల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, "మీ విజయం గర్వించదగినది.
- By Latha Suma Published Date - 05:41 PM, Wed - 21 May 25

Chhattisgarh Encounter : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా మాధ్ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పులు తీవ్ర ఉత్కంఠ కలిగించాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన మావోయిజం నిర్మూలనలో మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు భద్రతా వర్గాలు. ఈ ఆపరేషన్కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. భద్రతా బలగాల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ, “మీ విజయం గర్వించదగినది. మావోయిజం ముప్పును తరిమికొట్టి ప్రజలకు శాంతియుత, అభివృద్ధి ప్రధానమైన జీవితాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది” అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ను మోడీ రీట్వీట్ చేశారు.
Read Also: Mars Wrigley India : బూమర్ లాలిపాప్లను ఆవిష్కరించిన మార్స్ రిగ్లీ ఇండియా
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (వయసు 70) మృతిచెందిన విషయం అధికారికంగా వెల్లడైంది. బసవరాజు మరణం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు నిపుణులు. ‘‘నక్సలిజం నిర్మూలనలో ఇది ఒక మైలురాయి. వచ్చే 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు మోదీ సర్కార్ గట్టి సంకల్పంతో ముందుకెళ్తోంది,’’ అని అమిత్ షా వెల్లడించారు. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG) బలగాలు సమిష్టిగా పాల్గొన్నాయి. మాధ్ అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు గూఢచర్యం చేస్తున్నారన్న సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ను ప్రారంభించాయి.
ఇటీవల ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లోని కరేగుట్ట పర్వతాల్లో 24 రోజులపాటు జరిగిన ప్రత్యేక ఆపరేషన్లో మొత్తం 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో 16 మంది మహిళలు ఉన్నారు. ఈ క్రమంలో మావోయిస్టు శిబిరాలపై భద్రతా బలగాలు దాడులు మరింత వేగవంతం చేశాయి. భద్రతా వర్గాల ప్రకారం, ఇప్పటి వరకూ మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇప్పుడు గట్టిగా ఎదురుదెబ్బలు తినడమే కాక, మావోయిస్టు నేతృత్వం పూర్తిగా దెబ్బతిన్నదని స్పష్టం చేస్తోంది. ప్రజలకు శాంతియుత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాల ధైర్యానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఆపరేషన్ విజయవంతం కావడం వల్ల భద్రతా వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. భవిష్యత్తులో మావోయిస్టు ముప్పును పూర్తిగా నిర్మూలించేందుకు మరిన్ని చర్యలు చేపట్టనున్నారు.
Read Also: Chhattisgarh Encounter : అలిపిరిలో చంద్రబాబుపై దాడి సూత్రధారి హతం.. ఎవరీ కేశవరావు?