jammu and kashmir : పహల్గామ్ ఉగ్రదాడి.. 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం
ఈ దాడి జరిగిన నాటినుంచి ఇప్పటివరకు 100 రోజుల కాలంలో మొత్తం 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఆరుగురు పాకిస్థాన్కు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఆరుగురికి కూడా గతంలో జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న దాడుల్లో నేరుగా సంబంధం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
- By Latha Suma Published Date - 04:10 PM, Fri - 1 August 25

jammu and kashmir : ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి భారత భద్రతా వ్యవస్థను అలర్ట్ చేసింది. ఆ దాడిలో గాయపడ్డ సైనికులపై కేంద్రం గట్టి నిర్ణయం తీసుకుని వెంటనే ప్రతీకార చర్యలకు పాల్పడింది. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా మే 7న ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదుల నీడ దాటి వారిని హతమార్చేందుకు భారత బలగాలు విస్తృతంగా రంగంలోకి దిగాయి. ఈ దాడి జరిగిన నాటినుంచి ఇప్పటివరకు 100 రోజుల కాలంలో మొత్తం 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఆరుగురు పాకిస్థాన్కు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఆరుగురికి కూడా గతంలో జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న దాడుల్లో నేరుగా సంబంధం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
Read Also: Friendship Day 2025 : స్నేహితుల దినోత్సవం ఎలా సెలబ్రేట్ చేయాలి..?మరి ఈ ఏడాది ఇది ఏ రోజు వచ్చిందంటే..
భద్రతా బలగాలు పలు వ్యూహాత్మక ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా ‘ఆపరేషన్ మహాదేవ్’ సందర్భంగా పహల్గాం దాడికి బాధ్యులైన కీలక ముష్కరులను హతమార్చినట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అదే విధంగా, ‘ఆపరేషన్ శివశక్తి’ లో మరికొందరు ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఒక భద్రతా వర్గం ప్రకారం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఒక్కొక్క యూనిట్ తమవంతు పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ల సంఖ్యను స్పష్టంగా చెప్పలేం, ఎందుకంటే అవి నిరంతరంగా కొనసాగుతున్న మిషన్లుగా మారాయి అని మీడియాకు తెలిపారు. మే 15న షోపియాన్లోని కెల్లర్ అడవుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదే రోజున నాదెర్ ప్రాంతంలో మరో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇవన్నీ ఆపరేషన్ సిందూర్ పరిధిలో భాగంగా అమలైన చర్యలే కావడం గమనార్హం.
ఇటీవల పార్లమెంట్లో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..పహల్గాం దాడి కుట్రదారులపై ఆపరేషన్ సిందూర్ ద్వారా కఠినమైన ప్రతీకారం తీర్చాం. అంతేకాదు, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఆ దాడిలో నేరుగా పాల్గొన్న ముష్కరులను సైతం హతమార్చాం అని వెల్లడించారు. ఈ ఆపరేషన్లో భారత భద్రతా బలగాలు సరిహద్దును దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) ప్రాంతంలో 100 కిలోమీటర్ల లోపల వరకు వెళ్లి లక్ష్యాలను దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు అని నిఘా వర్గాలు అంచనా వేసాయి. పహల్గాం దాడికి ముందు POKలో 42 లాంచ్ ప్యాడ్లలో సుమారు 110–130 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు గూఢచారి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కశ్మీర్ లో 70–75 మంది ఉగ్రవాదులు యాక్టివ్గా, జమ్మూ, రాజౌరీ, పూంచ్ ప్రాంతాల్లో 60–65 మంది ఉగ్రవాదుల కదలికలు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ పటిష్ఠ చర్యలతో కేంద్రం పహల్గాం దాడికి స్పష్టమైన, దృఢమైన ప్రతిస్పందన ఇచ్చింది. భవిష్యత్లో ఇలాంటి ఉగ్రకృషిని అణిచివేయడంలో ఆపరేషన్ సిందూర్ మరియు ఆపరేషన్ మహాదేవ్ మైలురాయిలుగా నిలవనున్నాయి.
Read Also: Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. రేసులో ప్రముఖ నేతలు..!