PM Modi : కొత్త ఏడాదిలో ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన అనేక దౌత్య పర్యటనలు..?
భారత మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వచ్చే ఏడాది భారత్ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇది ఆయన తొలిసారి భారత్ పర్యటన అవుతుంది.
- By Latha Suma Published Date - 07:05 PM, Thu - 26 December 24

PM Modi : 2025లో ప్రధానమంత్రి మోడీ చైనాను సందర్శించే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్లో చైనాలో నిర్వహించనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కోసం ప్రధాని మోడీ చైనాకు వెళ్తారని భావిస్తున్నారు. ఇటీవల భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటించి, సరిహద్దు సమస్యలతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రెండు దేశాలు తమ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ఉద్దేశిస్తున్నాయి. ఇక భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
మరోవైపు వచ్చే ఏడాది క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ భారత్కు రానున్నారని, అదే సమయంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. యూరోపియన్ యూనియన్తో భారత్లో శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశం కోసం పలువురు యూరోపియన్ నాయకులు భారత్కు రానున్నారు. భారత మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వచ్చే ఏడాది భారత్ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇది ఆయన తొలిసారి భారత్ పర్యటన అవుతుంది.
అంతేకాక..జనవరిలో సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం భారత్కి వస్తారు. గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సియాంటో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మార్చి లేదా ఏప్రిల్లో చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ భారత్ సందర్శించనున్నారు. 2025 చివరిలో G20 సదస్సు దక్షిణాఫ్రికాలో, ASEAN సదస్సు మలేషియాలో జరగనున్నాయి. వీటికి హాజరయ్యేందుకు కూడా ప్రధానమంత్రి మోడీ ఆయా దేశాలకు వెళ్లే అవకాశముంది. ఈ పర్యటనలన్నీ భారత్ దౌత్య సంబంధాల పెంపుకు కీలకంగా మారవచ్చు. ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోడీ ఫ్రాన్స్కి పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ కూడా వెళ్లవచ్చు.
కాగా, వచ్చే ఏడాది ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన అనేక దౌత్య పర్యటనలు జరిగే అవకాశం ఉంది. 2020లో గల్వాన్ సంఘటనల తర్వాత భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. సరిహద్దు సమస్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవలే సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరుదేశాలు సైన్యాలను వెనక్కి పిలిపించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Read Also: RK Roja : చంద్రబాబు నాయుడు నిజానికి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు..!