Manipur is Burning Today: మండుతున్న మణిపూర్
కోర్టు తీర్పును నిరసిస్తూ మణిపూర్ (Manipur) లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ తో పాటు పలు గిరిజన సంఘాలు బుధవారం "ట్రైబల్ సాలిడారిటీ మార్చ్" నిర్వహించాయి.
- By Maheswara Rao Nadella Published Date - 04:10 PM, Thu - 4 May 23
Manipur is Burning Today : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రణరంగంగా మారింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గిరిజనేతరులైన మైతై వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే కోర్టు తీర్పును నిరసిస్తూ మణిపూర్ (Manipur) లోని ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్ యూఎం)తో పాటు పలు గిరిజన సంఘాలు బుధవారం “ట్రైబల్ సాలిడారిటీ మార్చ్” నిర్వహించాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పట్టణమైన చురాచాంద్పుర్ లో గిరిజన సంఘాల నిరసన ప్రదర్శన జరుగుతున్న క్రమంలో కొందరు వ్యక్తులు ఆంగ్లో-కుకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారు.
దీంతో హింస ప్రజ్వరిల్లింది. అనంతరం రాజధాని ఇంఫాల్ తో పాటు కంగ్పోక్కి టౌన్ లోనూ గిరిజనులు, గిరిజనేతరులకు మధ్య తలెత్తిన ఘర్షణ హింసాకాండకు దారి తీసింది. గుర్తు తెలియని వ్యక్తులు అనేక ఇండ్లు, వాహనాలు, ప్రార్ధనా స్థలాలను తగులబెట్టారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అక్కడ కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ఆర్మీ , అసోం రైఫిల్స్ ను రంగంలోకి దింపారు. ఆర్మీ ఎక్కడికక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మణిపూర్ (Manipur) కు పంపింది.
సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఈనేపథ్యంలో ఆర్మీ శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో 4వేల మంది ప్రజలకు ఆశ్రయం కల్పించారు. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సీఎంకు అమిత్ షా ఫోన్..
ప్రస్తుతం మణిపూర్ లో ఉన్న పరిస్థితి గురించి ముఖ్యమంత్రి బిరేన్ సింగ్తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ఫోన్ లో చర్చించారు. బుధవారం ఘర్షణలు చెలరేగిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీఎం వివరించారు. శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం చేపడుతున్న చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులను కేంద్రం సునిశితంగా గమనిస్తోందని వెల్లడించారు. కాగా, ఈ హింసకు కేంద్ర బిందువుగా నిలిచిన చురాచాంద్పుర్ లో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పాల్గొనాల్సిన సభా వేదికను కొన్ని రోజుల క్రితం నిరసనకారులు దహనం చేశారు.
అపార్థాలే దీనికి కారణం : మణిపూర్ సీఎం బీరేన్ సింగ్
ఈ పరిణామాలపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ స్పందిస్తూ.. సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్థాలే దీనికి కారణమని చెప్పారు. ఇరు వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి, వారి సుదీర్ఘ సమస్యలకు పరిష్కారాన్ని సాధిస్తామని చెప్పారు. గత 24 గంటల్లో జరిగిన విధ్వంసకాండలో విలువైన ప్రాణాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు, ఆస్తులకు నష్టం జరగడం దురదృష్టకరమన్నారు.
నా రాష్ట్రం తగలబడిపోతోంది : బాక్సర్ మేరీకోమ్
‘‘నా రాష్ట్రం తగులబడుతోంది. దయచేసి ఆదుకోండి’’ అంటూ మణిపూర్ కు చెందిన ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 3 నుంచి మణిపూర్లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆమె అన్నారు. హింసలో అనేక మంది తమ కుటుంబసభ్యులను కోల్పోవడం బాధగా ఉందని తెలిపారు. ఆమె తన ట్వీట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వివిధ మీడియా సంస్థలకు ట్యాగ్ చేశారు. అందరికీ రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉందని మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Tamannah Bhatia : గ్రీన్ కలర్ డ్రెస్ లో తమన్నా కొత్త ఫోటోషూట్
Related News
Kanhaiya Kumar: పూలమాల వేస్తానంటూ కాంగ్రెస్ అభ్యర్థిపై చెప్పుతో దాడి
కాంగ్రెస్ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కన్హయ్య కుమార్పై శుక్రవారం ఇద్దరు యువకులు దాడి చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కన్హయ్య కుమార్ను ఈ యువకులు చెప్పుతో కొట్టారు. అయితే అక్కడే ఉన్న కన్హయ్య మద్దతుదారులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు.