Deaths In Mansion : 50 కోట్ల భవనంలో తల్లి, తండ్రి, కూతురి మిస్టరీ డెత్ ?
Deaths In Mansion : అది 50 కోట్ల రూపాయలు విలువ చేసే భారీ భవనం.. అందులో నివసించే సంపన్న దంపతులు, వారి టీనేజీ కుమార్తె అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.
- Author : Pasha
Date : 30-12-2023 - 1:00 IST
Published By : Hashtagu Telugu Desk
Deaths In Mansion : అది 50 కోట్ల రూపాయలు విలువ చేసే భారీ భవనం.. అందులో నివసించే సంపన్న దంపతులు, వారి టీనేజీ కుమార్తె అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో ఉన్న డోవర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. చనిపోయిన వారిని భారత సంతతికి చెందిన రాకేష్ కమల్ (57), అతడి భార్య టీనా (54), వారి 18 ఏళ్ల కుమార్తె అరియానాగా గుర్తించారు. గురువారం రాత్రి 7:30 గంటలకు వారి డెడ్ బాడీలను ఇంట్లో అనుమానాస్పద స్థితిలో గుర్తించారు. అయితే రాకేష్ కమల్ మృతదేహం దగ్గర తుపాకీ దొరికింది. బహుశా ఆ తుపాకీతో భార్య, బిడ్డను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసును గృహ హింస కోణంలోనూ విచారిస్తున్నట్లు జిల్లా కోర్టు జడ్జి వెల్లడించారు. వేరెవరైనా ఆ ముగ్గురిని చంపి పారిపోయి ఉండొచ్చనే కోణాన్ని కూడా వదలబోమని స్పష్టం చేశారు. ఇప్పుడే ఈ మరణాలను హత్యలుగా, ఆత్మహత్యలుగా వర్గీకరించలేమని(Deaths In Mansion) తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘రాకేష్ కమల్, టీనా దంపతులు ఎంతో లగ్జరీగా జీవించేవారు. 2019లో ఏకంగా రూ.50 కోట్లకు 11 బెడ్ రూమ్స్ ఉండే పేద్ద భవనాన్ని కొన్నారు. ఆ తర్వాత వారి ఆర్థిక సమస్యలు పెరిగిపోయాయి. దీంతో గతేడాది సగం ధరకే (రూ.25 కోట్లకు) అమ్మేశారు. ఈ ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకొని ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి’’ అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు, మూడు రోజులుగా బంధువులు చేస్తున్న ఫోన్ కాల్స్కు వారు స్పందించడం లేదని.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే రాకేష్ కమల్, టీనా, అరియానా డెడ్ బాడీస్ కనిపించాయని తెలిపారు. డోవర్ అనేది మసాచుసెట్స్ రాష్ట్రంలోనే అత్యంత ధనికులు నివసించే ప్రాంతం.టీనా.. ఢిల్లీ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ యూనివర్సిటీల పూర్వ విద్యార్థిని. ఈమె మసాచుసెట్స్లోని అమెరికన్ రెడ్క్రాస్ డైరెక్టర్ల బోర్డులో ఒకరు. కమల్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి.