Gaganyaan Mission..2026 లో ‘గగన్ యాన్’ మిషన్ : ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటన
- By Latha Suma Published Date - 05:09 PM, Mon - 28 October 24

ISRO Chief Somnath : మిషన్ ‘గగన్ యాన్’ పై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక అప్డేట్ చేశారు. అంతరిక్షానికి మనిషిని పంపించే లక్ష్యంగా మొట్టమొదటి మానవ సహిత మిషన్ గగన్ యాన్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. మొదటగా అనుకున్నట్టు 2025లో కాకుండా ఈ మిషన్ ను 2026లో చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమొరియల్ లెక్చర్ సందర్భంగా ఈ వివరాలను సోమనాథ్ వెల్లడించారు.
చంద్రయాన్ -3 మిషన్ ఆదిత్య ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో అదేబాటలో తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గగన్ యాన్ యాత్రను చేపట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి మూడు రోజుల పాటు పంపి.. సురక్షితంగా వారిని భూమి పైకి తేవడమే ఈ మిషన్ లక్ష్యం. వాస్తవానికి 2022లోనే ఈ ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉండగా.. కరోనా వల్ల ఆలస్యమైందని తెలిపారు. ఈ మిషన్ విజయవంతం అయితే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తరువాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది.
ఇకపోతే..రానున్న సంవత్సరాల్లో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను కూడా సోమనాథ్ వెల్లడించారు. శాంపిల్ రిటర్న్ మిషన్ చంద్రయాన్-4 2028లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సోమనాథ్ వెల్లడించారు. అంతేకాక.. భారత్-అమెరికా సంయుక్తంగా చేపట్ట దలచిన నిసార్ మిషన్పై కూడా సోమనాథ్ వివరాలు తెలపారు. ఈ మిషన్ను వచ్చే ఏడాది అంటే 2025లోనే ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జగ్జాతో చంద్రయాన్-5 మిషన్ ప్రయోగం చేపట్టనున్నామని, ఇది మూన్-ల్యాండింగ్ మిషన్ అని వివరించారు. ఈ మిషన్ అసలు పేరు లుపెక్స్ లేదా ‘లునార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్’ అని చెప్పారు. అయితే ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్న సమయాన్ని ఆయన వెల్లడించలేదు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2025లో ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుని చంద్రయాన్-5గా సోమనాథ్ పేర్కొన్నారు కాబట్టి చంద్రయాన్-4 పూర్తయిన తర్వాత 2028లో చేపట్టే అవకాశలు ఉన్నట్లు తెలుస్తుంది.