Chalo Delhi : ఢిల్లీ చలో..రాజధానిలో 144 సెక్షన్.. భారీగా బలగాల మోహరింపు
- Author : Latha Suma
Date : 12-02-2024 - 2:14 IST
Published By : Hashtagu Telugu Desk
Farmers Protest Chalo Delhi : కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించాలని కోరుతూ మంగళవారం ఢిల్లీ చలో(Chalo Delhi) పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. పంజాబ్తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను నిలిపి ఉంచారు. అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు.
రైతుల ఆందోళనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్(section-144) విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం నెల రోజుల పాటు దిల్లీలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. నగరంలో ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని పోలీసులు వెల్లడించారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. లౌడ్ స్పీకర్ల వాడకంపైనా ఈ ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. పోలీసు శాఖ సూచనలు అనుసరించి ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.
<span style=”color: #ff0000;”><strong>We’re now on WhatsApp</strong></span>. <a href=”https://whatsapp.com/channel/0029Va94sppFy72LQLpLhB0t”><strong>Click to Join.</strong></a>
ఢిల్లీ చలోలో పాల్గొనకుండా నివారించేందుకు ఖాప్ పంచాయతీలు, పలు గ్రామాల సర్పంచులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది రైతులు దిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ ఆందోళనలను ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు 40 సార్లు రిహార్సల్ నిర్వహించాయని తెలిపాయి. కొందరు రైతులు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, అర్జున్ ముండా సహా పలువురు బిజెపి(bjp) సీనియర్ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.
మరోవైపు రైతుల ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇప్పటికే హరియాణాలోని పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. ఈ నెల 13 వరకు అన్ని టెలికాం సేవలపై ఆంక్షలు విధించారు.