Young Boy Died: పోలీస్ ఈవెంట్స్ లో విషాదం.. 1600 మీటర్ల రన్నింగ్ పూర్తి చేసి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల కేంద్రానికి చెందిన లింగమల్ల మహేశ్(26) అనే యువకుడు పోలీస్ ఈవెంట్స్ (Police Events)కు వెళ్లి శనివారం మృతిచెందాడు.
- Author : Gopichand
Date : 25-12-2022 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండల కేంద్రానికి చెందిన లింగమల్ల మహేశ్(26) అనే యువకుడు పోలీస్ ఈవెంట్స్ (Police Events)కు వెళ్లి శనివారం మృతిచెందాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం జరిగిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గత కొన్ని నెలల నుండి ఈవెంట్స్ (రన్నింగ్)లో గెలుపొందాలని హైదరాబాద్ లో శిక్షణ పొందాడు. కాగా శనివారం హైదరాబాద్ లో జరిగిన కానిస్టేబుల్ ఈవెంట్స్ లో 1600 మీటర్లు పూర్తి చేసి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
Also Read: Tunisha Sharma Suicide : తునీషా శర్మ ఆత్మహత్య!
శనివారం అంబర్ పేటలోని సిసిఎల్ గ్రౌండ్ లో ఈవెంట్స్ లో పాల్గొనేందుకు మహేష్ హాజరయ్యాడు. 1600 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని నిర్ణీత సమయానికి పరుగును పూర్తిచేసి తదుపరి ఈవెంట్స్ కు అర్హత సాధించాడు. అయితే పరుగుపందెం ముగిసిన కొద్దిసేపటికే అతడు తీవ్ర అస్వస్థతకు గురయి మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే పోలీస్ అధికారులు అతన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం సమయంలో మహేష్ ప్రాణాలు కోల్పోయాడు. మహేష్ మృతి వార్త పోలీసులు అతడి తల్లిదండ్రులకు తెలియజేయగా వారు హాస్పిటల్ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్వస్థలానికి తరలించారు. మహేష్ మృతితో మహాముత్తారంలో తీవ్ర విషాదం నెలకొంది.