CM Revanth : రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తాంః సిఎం రేవంత్ రెడ్డి
- Author : Latha Suma
Date : 15-02-2024 - 1:49 IST
Published By : Hashtagu Telugu Desk
At Sant Sevalal Maharaj Program :హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో సంత్ సేవాలాల్ మహారాజ్(Sant Sevalal Maharaj )విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలని బంజారాలు నినదించారని అన్నారు. బంజారాల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా సర్కార్ ఏర్పడిందని చెప్పారు. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఆయన జయంతి ఉత్సవాలు జరిపేందుకు రూ.2 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే జీవో మంజూరు చేయాలని అధికారులకు ఆదేశిస్తున్నట్లు రేవంత్రెడ్డి వెల్లడించారు.
“రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు(schools)నిర్మించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. చదువులను తండాకు తీసుకెళ్లే బాధ్యత మాది. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మా ప్రభుత్వానిది. గ్రామ పంచాయతీలుగా మారిన తండాలకు పంచాయతీ భవనాలు నిర్మిస్తాం. విద్యుత్, తాగునీరు ఏ సమస్య ఉన్నా, ప్రభుత్వం దృష్టికి తీసురండి. మీ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుంది.”
We’re now on WhatsApp. Click to Join.
అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని రేవంత్రెడ్డి వివరించారు. అలాగే అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)ఎస్టీలకు ఎప్పుడూ ప్రత్యేకమైన గౌరవం ఇస్తోందని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ బోధనలు పాటిస్తూ, ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. చదువుకున్నప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందని తెలిపారు. అందుకే చదువుల బాట పట్టాలని, సంత్ సేవాలాల్ మార్గంలో నడవాలని రేవంత్రెడ్డి వివరించారు.
70 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా తాము సెలవు తీసుకోలేదని రేవంత్రెడ్డి తెలిపారు. ఇది ఎవరికీ కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదని, ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం కష్టపడే సర్కార్ అని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇదని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని రేవంత్రెడ్డి కోరారు.
వచ్చే సేవాలాల్ జయంతి నాటికి హైదరాబాద్లో సంత్ సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komati Reddy Venkat Reddy) తెలిపారు. బంజారాలు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, మాజీ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
read also :Visa- Mastercard: వీసా, మాస్టర్కార్డ్లపై RBI కఠిన చర్యలు.. ఇకపై ఆ చెల్లింపులు నిషేధం..!