Monsoon Rains: మునుపెన్నడూ చూడని వాతావరణ మార్పులు
- Author : Vamsi Chowdary Korata
Date : 11-07-2026 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుత వర్షాకాలం సీజన్ కాస్తా ఎండాకాలాన్ని తలపిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్నినో’ (El Niño) ప్రభావం కారణంగా రుతుపవనాల గమనం దెబ్బతిని, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండాల్సి ఉండగా, దానికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 37 నుండి 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు వస్తే చాలు, జనం తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో సమ్మర్ రోజులను గుర్తుచేసుకుంటూ అల్లాడిపోతున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ఈ వింత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ‘మాన్సూన్ బ్రేక్’ (రుతుపవనాల విరామం) కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కాలంలో గాలిలో తేమ శాతం తగ్గి, ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును కూడా దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఆకాశం పొడిగా మారి, తీవ్రమైన వేడి గాలులు వీచే ప్రమాదం ఉన్నందున పూర్తిగా వేసవి కాలం లాంటి వాతావరణమే ఉంటుందని పేర్కొన్నారు. రైతులు, సాధారణ ప్రజలు ఈ తాత్కాలిక వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.