Skill University : స్కిల్ యూనివర్సిటీ పై తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
- By Latha Suma Published Date - 11:43 PM, Wed - 14 August 24

Skill University : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ(Young India Skill University) ఏర్పాటు చేస్తూ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఇటీవల అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీలో 17 కోర్సుల్లో ప్రతి సంవత్సరం 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఈ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛైర్మన్గా వ్యవహరిస్తారని సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. గురువారం మధ్యాహ్నం కొత్తగూడెం జిల్లా పూసుగూడెం చేరుకోనున్న సీఎం సీతారామ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి, మోటర్ స్విచ్ ఆన్ చేయనున్నారు. అనంతరం మంత్రులతో కలిసి గోదావరి జలాలకి పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా వైరాలో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. ఆ బహిరంగసభ వేదికపై నుంచే మూడో విడత రైతురుణ మాఫీని రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు.
Read Also: Manish Sisodia : గవర్నర్ పదవిపై మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు
సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ క్రమంలో ప్రాజెక్టు మొదటి మోటారు స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తొమ్మిది నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించే విధంగా పనులు పూర్తి చేయటం చరిత్ర అని చెప్పుకొచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే సీతారామ ప్రాజెక్టు ప్రారంభించడం శుభ సూచికమని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.