Bandi Sanjay: రేవంత్ ఏడుపుకు అదే కారణం.. ఈటల వ్యాఖ్యల్లో తప్పులేదు: బండి సంజయ్
టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు.
- Author : Gopi
Date : 23-04-2023 - 2:12 IST
Published By : Hashtagu Telugu Desk
టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. బసవేశ్వరుని జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద ఉన్న బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతున్నారని విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ముట్టజెప్పారని ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో రూ.25 కోట్ల వివాదంపై మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ మొత్తాన్ని తీసుకుంది. రేవంత్రెడ్డి తీసుకున్నారని మేం అనలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి. దీంతో తన పదవి పోతుందనే బాధలో రేవంత్ ఉన్నారు. అందుకే నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని పేర్కొన్నారు.
Also Read: Telangana: ఫిలిప్పీన్స్లో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మృతి.. కారణమిదేనా..?
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఆయనకు తనకు పోలిక ఏంటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఆయన జైలుకు వెళ్లి వచ్చారని విమర్శించారు. తాను మాత్రం విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో ఉన్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తామంతా జైలుకు వెళ్లినప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. తన గురించి చాలా హీనంగా మాట్లాడారని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కంటతడి పెట్టడంపై కూడా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. రాజకీయ నాయకులు కన్నీళ్లు పెట్టడం మంచిదికాదని సూచించారు. ధీరుడెప్పుడూ కన్నీళ్లు పెట్టడని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు తీసుకుందనే విషయంలో రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదని స్పష్టం చేశారు.