Adilabad: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక!
- Author : Balu J
Date : 23-01-2024 - 11:01 IST
Published By : Hashtagu Telugu Desk
Adilabad: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం బాలిక డెలివరీ కోసం చేరింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. కడుపునొప్పి రావడంతో బాలికను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బాలిక, నవజాత శిశువు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
అసలు టీనేజీలో ఎవరూ ప్రేమలో పడరు. ఆకర్షణలో పడతారు. తల్లిదండ్రులమాట వినే స్థితిలో ఉండరు. వాళ్ళతో పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఇంట్లోనుండి పారిపోవుట, లేదా ఆత్మహత్య చేసుకొనుట మొదలైనవి చేస్తారు. అయితే తల్లిదండ్రులు ఆవేశ పడకుండా స్థిమితంగా ఈవయస్సులో ప్రేమ అనేది చదువు, లక్ష్యం కంటే గొప్పది కాదని, తమ లక్ష్యాన్ని తాము చేరుకుంటే వచ్చే ఆనందం ఈ ఆకర్షణకంటే గొప్పదని తెలియజేయాలి. మొదట్లో వారు మాట వినకపోవచ్చు.
ఎందుకంటే 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ ప్రేమ కథలు అంటూ వస్తున్న దిక్కుమాలిన సినిమాల ప్రభావం ఈ వయస్సులో ఎక్కువ ఉంటుంది. అదేదో గొప్ప అన్న భావనలో ఉంటారు పిల్లలు. మనం చెప్పే నీతి మెదడుకు ఎక్కదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాలి. అవసరం అయితే కొంతకాలం వారిని ఎక్కడికైనా తీసుకువెళ్లాలి. కుటుంబం అంతా వాళ్లకు బాసటగా నిలవాలి తప్ప వాళ్ళేదో తప్పు చేసినట్లు వెలివేయరాదు. మనం ఎంత ప్రేమగా ఉంటే వాళ్ళు తమ తప్పు తెలుసుకుంటారు. ఈ వయస్సులో మనం వాళ్ళను దారి తప్పకుండా చూస్తే వాళ్ల అద్భుతమైన జీవితాన్ని కాపాడినట్లే.!