Saraswati Pushkaras: మే 15 నుండి 26 వరకు సరస్వతీ పుష్కరాలు
- By Gopichand Published Date - 08:12 PM, Sat - 11 January 25

Saraswati Pushkaras: మే 15 నుంచి 26 వ తేదీ వరకు సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాలు (Saraswati Pushkaras) నిర్వహించారు. ఈ పుష్కరాలను ఘనంగా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లను కాశీ, హరిద్వార్, ప్రయాగ పుణ్యక్షేత్రాల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలన్నిటిని అత్యాధునిక వసతులతో కళాత్మకంగా రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాలు దేశంలో మరెక్కడా జరగవని, కాళేశ్వరం సంగమ స్థలంలో మాత్రమే వందల ఏళ్లుగా నిర్వహిస్తున్నారన్నారు. పుష్కరాల ఏర్పాట్లు, స్నాన ఘట్టాల ఆధునీకరణ, శానిటేషన్ పనుల కోసం రూ.25 కోట్ల నిధులు కేటాయించారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రల కూడలిలో గోదావరి, ప్రాణహిత నదులు, అంతర్వాహినిగా సరస్వతి స్రవంతి కలిసే చోటు అత్యంత పవిత్రమైన సంగమమని అన్నారు. స్నాన ఘట్టాలను ఆధునికంగా నిర్విహించాలన్నారు. రోడ్లను పునర్మించి, విస్తరించడం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన పనులను వేగం పూర్తి చేయాలని పేర్కొన్నారు.
Also Read: Singapore Passport : సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఎలా అయింది ?
పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. హెలికాప్టర్ జాయ్ రైడ్ల కోసం హెలిపాడ్లకు మరమ్మతులు చేసి సిద్ధం చేయాలన్నారు. ఆలయ పర్యాటక ప్రదేశంగా కాళేశ్వరానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఏడాది పొడవునా భక్తులు వచ్చేలా ఎక్కడ రాజీ పడకుండా మౌలిక వసతుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. అన్ని శాఖలను సమన్మయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం ఆర్టీసి బస్ స్టేషన్ ఉన్న ప్రదేశంలో అత్యాధునిక, ఆకర్షణీయమైన నూతన బస్ స్టేషన్ ను నిర్మించాలని, అత్యాధునిక వీధి దీపాలు, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. వీటి కోసం రూ.62 లక్షల నిధులు ఇప్పటికే విడుదలయ్యాయన్నారు.
ఫిబ్రవరి 7 నుంచి 19 వరకు నిర్వహించనున్న కుంబాభిషేకం పనులను కూడా ఎక్కడా లోపం లేకుండా చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ కమిషనర్ ఈ.శ్రీధర్, జాయింట్ కమిషన్ రామకృష్ణారావు, ఎస్ఈ దుర్గాప్రసాద్, టూరిజం ఎండీ ప్రకాశ్, ట్రాన్స్ కో ఎస్ఈ మల్సూర్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఇఇ నిర్మల, డిపిఓ నారాయణరావు, ఇరిగేషన్ ఇఇ తిరుపతి, డిపిఆర్వో శీలం శ్రీనివాసరావు, కాళేశ్వరం ఇఓ మారుతి, భూపాలపల్లి ఆర్టీసీ డివిజనల్ మేనేజర్, డిఎం ఇందు, తదితరులు పాల్గొన్నారు.