Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. నెలాఖరులోగా రైతు బంధు
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ వివరాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెలాఖరులోగా రైతులందరి ఖాతాల్లో రైతుబంధు మొత్తాలను జమ చేస్తామని
- Author : Vamsi Chowdary Korata
Date : 17-01-2024 - 11:19 IST
Published By : Hashtagu Telugu Desk
Rythu Bandhu: తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ వివరాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ నెలాఖరులోగా రైతులందరి ఖాతాల్లో రైతుబంధు మొత్తాలను జమ చేస్తామని, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రెండెకరాల లోపు భూమి ఉన్న 29 లక్షల మంది రైతుల ఖాతాలకు రైతు బంధు పథకం లబ్ధిని బదిలీ చేశామని, మిగిలిన రైతులకు డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు.
ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. రైతులకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంకితభావంతో ఉన్నారని, వ్యవసాయరంగాన్ని ఆదుకునే విధానాలపై ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రానగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి తుమ్మల.. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నేటికీ తన ఆదర్శ నాయకుడంటూ మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. రైతుబంధుతోపాటు.. రుణమాఫీపై కూడా తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. యాసంగి సీజన్లో రైతుబంధు వేయడానికి రూ.7,625 కోట్ల నిధులు అవసరం కాగా.. ఇప్పటివరకు ఎకరం లోపు పొలం ఉన్న 21 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.1,050 కోట్లు జమ చేసింది.మిగతా నిధుల కోసం కేంద్రాన్ని రూ.13,500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి కోరగా.. కేంద్రం రూ.9 వేల కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ రుణం నుంచి కొంత రైతుబంధు పథకం కింద రైతులకు జమ చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Chris Gayle: క్రిస్ గేల్ మంచి మనసు.. ఫ్రీగా పెట్రోల్