Congress Schemes: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు -భట్టి విక్రమార్క
Congress Schemes : అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు -భట్టి
- Author : Sudheer
Date : 21-01-2025 - 10:48 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో గతంలో ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోనివారు కూడా ఇప్పుడు చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులు స్పష్టం చేసారు. నేటి నుండి 24 వ తేదీ వరకు జరుగుతున్న గ్రామ సభల నిర్వహణ, ప్రజల స్పందన, నాలుగు పథకాల కు సంబంధించి జిల్లా కలెక్టర్లతో నేడు సాయంత్రం సచివాలయం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. డిప్యూటీ సి.ఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి లు ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Padma Rao Goud: ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిక
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు దాదాపు రూ.40 వేల కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని వెల్లడించారు. దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నందున ఈ రెండు పథకాలకు అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరి అనేది నిరంతర ప్రక్రియ అని, గతంలో దరఖాస్తు చేయని వారు ఈ గ్రామ సభలలో ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తు దారుల్లో ఇల్లు లేని వారు, ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారి జాబితా గ్రామ సభలలో తెలియచేయాలని, మరెవ్వరైనా దరఖాస్తు చేసుకోక పొతే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు వివరించారు.