KCR Sentiment : కేసీఆర్ సెంటిమెంట్లో..రాజయ్య..ఈటెల..హరీశ్.?
సెంటిమెంట్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. పూజలు, యాగాలు, ముహుర్తాలు..తదితరాల రూపంలో సెంటిమెంట్ ను ప్రదర్శిస్తుంటారు. సచివాలయ నిర్మాణం నుంచి ఫాం హౌస్ వరకు అన్నీ కేసీఆర్ కు సెంటిమెంట్లే.
- By CS Rao Published Date - 04:37 PM, Thu - 11 November 21
సెంటిమెంట్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. పూజలు, యాగాలు, ముహుర్తాలు..తదితరాల రూపంలో సెంటిమెంట్ ను ప్రదర్శిస్తుంటారు. సచివాలయ నిర్మాణం నుంచి ఫాం హౌస్ వరకు అన్నీ కేసీఆర్ కు సెంటిమెంట్లే. అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సెంటిమెంట్ కోణం నుంచి అనుచరులు చూస్తుంటారు. ఇప్పుడు మంత్రి హరీశ్ రావుకు వైద్యశాఖను అప్పగించడం కూడా అందులో భాగమని పార్టీ వర్గాల్లో టాక్.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలుత వైద్య, ఆరోగ్యశాఖను రాజయ్యకు అప్పగించాడు. ఆ తరువాత ఆయన మీద ఒక లేడీ ఆడియో విడుదల అయింది. ఫలితంగా మంత్రి పదవి రాజయ్యకు పోయింది. ఎస్సీ వర్గానికి చెందిన రాజయ్య కాబట్టి ఆడియోను బేస్ చేసుకుని మంత్రి పదవి నుంచి తప్పించాడని కేసీఆర్ మీద ఆనాడు ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత వాటికి చెక్ పెట్టేలా 2018 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాజయ్యకు కల్పించాడు.
రెండోసారి 2018లో అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయలేదు. హోంమంత్రిగా మహ్మద్ ఆలీతో కలిసి చాలా కాలం పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపాడు. ప్రత్యర్థుల నుంచి విమర్శల కారణంగా క్యాబినెట్ ను అప్పట్లో ఏర్పాటు చేశాడు. కానీ, హరీశ్ రావుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇక హరీశ్ రావు పని అయిపోయిందని చాలా మంది పార్టీలోనే చర్చించుకోవడం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను చేయడానికి ఉద్దేశపూర్వకంగా హరీశ్ ను తక్కువ చేస్తున్నాడని టాక్ వినిపించింది. వాటన్నిటికీ తెరదింపుతూ, కేటీఆర్, హరీశ్ లను మంత్రివర్గంలోకి తీసుకుంటూ, మరోసారి మంత్రివర్గాన్ని రెండేళ్ల క్రితం విస్తరించాడు. ఆనాటి నుంచి పలుమార్లు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం జరుగుతోంది.
ఒక వేళ కేటీఆర్ ను సీఎం చేస్తే..హరీశ్, ఈటెల కలిసి పార్టీని చీల్చుతారని అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. టీఆర్ఎస్ పార్టీకి ఓనర్లు ఎవరు దగ్గర నుంచి కథ మొదలైయింది. ఆనాటి నుంచి హరీశ్, ఈటెల వాలకంపై కేసీఆర్ నిఘా పెట్టాడని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని పడేయడానికి ఈటెల బెంగుళూరులో ప్రయత్నం చేశాడని పార్టీలోని ఒక వర్గం వినికిడి. ఆ విషయాన్ని హరీశ్ సకాలంలో కేసీఆర్కు మోశాడని, అందుకే ఆయనకు మళ్లీ ప్రాధాన్యం పెరిగిందని తాజా గుసగుసలు.
హుజురాబాద్ ఎన్నికలను టీఆర్ఎస్ వైపు నుంచి అన్నీ తానై చూసుకునే బాధ్యతను హరీశ్కు అప్పగించాడు కేసీఆర్. ఇలాంటి బాధ్యతలను దుబ్బాకలో కూడా ఇచ్చాడు. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ కు మాస్ ఫాలోయింగ్ కూడా కేటీఆర్ తో పోల్చుకుంటే ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కు సీఎం పదవిని అప్పగిస్తే, హరీశ్ రూపంలో ప్రమాదం ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే, వ్యూహాత్మకంగా హరీశ్ ను పాతాళానికి తొక్కే ఎత్తుగడ కేసీఆర్ వేశాడని గులాబీ పార్టీలోని అంతర్గత టాక్. ఆ క్రమంలోనే సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇస్తూ వైద్య, ఆరోగ్యశాఖను హరీశ్ కు అప్పగించాడట. 2014 నుంచి ఇప్పటి వరకు రాజయ్య తరువాత ఆ శాఖను నిర్వహించిన ఈటెల పరిస్థితి అందరికీ తెలిసిందే. పైగా ఈటెల రాజీనామా తరువాత ఇటీవల దాకా కేసీఆర్ ఆధీనంలోనే ఆ శాఖ ఉండేది. అందుకే, గతంలో ఎప్పుడూ లేనివిధంగా కేసీఆర్ ఇటీవల రాజకీయంగా డామేజ్ అయ్యాడు.
ఇటీవల ఢిల్లీకి రెండుసార్లు వెళ్లాడు. తొలిసారి నెలపాటు అక్కడే ఉన్నారు. రెండోసారి వెళ్లినప్పుడు వారం ఉన్నాడు. సహజంగా ఎక్కువ రోజులు ఢిల్లీలో కేసీఆర్ ఉండడు. కానీ, తద్భిన్నంగా ఆయన రెండుసార్లు టూర్ సాగింది. కేంద్రం చెప్పిన వ్యవసాయ చట్టాలను అంగీకరించాడు. ఆయుష్మాన్ భవకు జై కొట్టాడు. హుజురాబాద్ ఎన్నికల్లో ఘోరంగా ఈటెల దెబ్బకు నష్టపోయాడు. ఇవన్నీ నెగిటివ్ సంకేతాలుగా భావించాడట కేసీఆర్. అందుకే,వైద్య, ఆరోగ్యశాఖను హరీశ్ కు తగిలించాడట. సో..కేసీఆర్ సెంటిమెంట్ ఫలిస్తే..రాజయ్య, ఈటెల జాబితాలో హరీశ్ చేరతాడని సెంటిమెంట్ ను కేసీఆర్ టీం రంగరిస్తోంది. ఏం జరుగుతుందో చూద్దాం!
Related News
Harish Vs Revanth : హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం – రేవంత్ రెడ్డి
మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తు వస్తుందంటూ రేవంత్ సెటైర్ వేశారు