Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!
హైదరాబాద్ మహానగరంలో వాహనదారులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య 'పార్కింగ్'. ఎక్కడికి వెళ్లినా వాహనాన్ని ఎక్కడ నిలపాలనే టెన్షన్ నుంచి విముక్తి కలిగిస్తూ, జీహెచ్ఎంసీ (GHMC) ఒక విప్లవాత్మకమైన "స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్" ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది
- Author : Sudheer
Date : 17-02-2026 - 1:20 IST
Published By : Hashtagu Telugu Desk
Parking : హైదరాబాద్ మహానగరంలో వాహనదారులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘పార్కింగ్’. ఎక్కడికి వెళ్లినా వాహనాన్ని ఎక్కడ నిలపాలనే టెన్షన్ నుంచి విముక్తి కలిగిస్తూ, జీహెచ్ఎంసీ (GHMC) ఒక విప్లవాత్మకమైన “స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్” ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. ఐటీ రంగంలో దూసుకుపోతున్న భాగ్యనగరంలో పార్కింగ్ నిర్వహణను కూడా టెక్నాలజీతో అనుసంధానిస్తూ, వాహనదారులు తమ ఫోన్ ద్వారానే పార్కింగ్ స్లాట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించబోతోంది. దీనివల్ల రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం తగ్గి, ట్రాఫిక్ సమస్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
స్మార్ట్ పార్కింగ్ ఎలా పనిచేస్తుంది?
ఈ నూతన విధానం పూర్తిగా ‘మై జీహెచ్ఎంసీ’ (My GHMC) మొబైల్ యాప్తో అనుసంధానమై ఉంటుంది. ప్రతి పార్కింగ్ స్థలం వద్ద అత్యాధునిక సెన్సార్లను అమరుస్తారు. వాహనదారులు యాప్లోకి వెళ్లి తమకు 500 మీటర్ల పరిధిలో ఎక్కడ ఖాళీ స్లాట్లు ఉన్నాయో లైవ్ మ్యాప్ ద్వారా చూసుకోవచ్చు. నిర్ణీత రుసుము చెల్లించి మనకు కావాల్సిన స్లాట్ను ముందే రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల పార్కింగ్ కోసం రోడ్లపై తిరుగుతూ సమయాన్ని, ఇంధనాన్ని వృథా చేయాల్సిన పని ఉండదు. అంతేకాకుండా, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం ఛార్జింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
నగరంలోని కీలక ప్రాంతాల్లో అందుబాటులోకి
ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ఖైరతాబాద్ జోన్ పరిధిలోని 14 కీలక ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు. ఇందుకోసం రెండు సంస్థలు (జ్రుతి సొల్యూషన్స్ మరియు జూకి టెక్నాలజీస్) కాంట్రాక్టులు దక్కించుకున్నాయి.
ముఖ్యమైన ప్రాంతాలు: సోమాజిగూడ (ది పార్క్ హోటల్), నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్, షేక్ పేట ఫ్లైఓవర్ కింద, సత్యం థియేటర్, లిబర్టీ చౌరస్తా (టీటీడీ ఆలయం), హిమాయత్ నగర్, మెహిదీపట్నం (PVNR ఎక్స్ప్రెస్వే కింద), అబిడ్స్ తాజ్ మహల్ హోటల్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ స్మార్ట్ పార్కింగ్ స్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ఎంజీబీఎస్ సమీపంలోని స్టేట్ లైబ్రరీ, బషీర్ బాగ్ ఫ్లైఓవర్ పరిసరాల్లో కూడా స్మార్ట్ పార్కింగ్ బోర్డులు దర్శనమివ్వనున్నాయి.