Telangana Praja Palana Utsavalu : నేటి నుండి తెలంగాణ వ్యాప్తంగా ‘ప్రజా పాలన ఉత్సవాలు’
Telangana Praja Palana Utsavalu : 'ప్రజా పాలన ఉత్సవాల' షెడ్యూల్ ప్రకారం.. నేడు మక్తల్లో (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు) ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
- Author : Sudheer
Date : 01-12-2025 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నేటి (డిసెంబర్ 1) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా పాలన ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రతిరోజూ ఒక ఉమ్మడి జిల్లాలో జరగనున్నాయి. గతంలో పాలనలో జరిగిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని, మరింత మెరుగైన భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఒక ‘అద్భుత పాలసీ’ని జాతికి అంకితం చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణను బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టే లక్ష్యంతో ‘విజన్ డాక్యుమెంట్’ తయారు చేసినట్లు సీఎం వివరించారు.
Perfume Side Effects: పర్ఫ్యూమ్ వాడుతున్నారా? అయితే ఈ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!
ఈ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలను వెల్లడించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రత్యేకంగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు’ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి, ఆ సంపదను పేద ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తెలంగాణకు ‘రెండో మణిహారం’ సిద్ధం చేస్తున్నట్లు, రాష్ట్రానికి నాలుగు కొత్త ఎయిర్పోర్టులు రాబోతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ లక్ష్యమని పేర్కొంటూ, భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని వివరించారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే పాలన, పారదర్శకత, మరియు వేగవంతమైన అభివృద్ధిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
‘ప్రజా పాలన ఉత్సవాల’ షెడ్యూల్ ప్రకారం.. నేడు మక్తల్లో (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు) ఉత్సవాలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రతిరోజూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనడంతో ఒక ఉమ్మడి జిల్లాలో కార్యక్రమం జరుగుతుంది. డిసెంబర్ 6న హైదరాబాద్లోని యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన అంశాలు డిసెంబర్ 8 & 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్నాయి. 8వ తేదీన గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించగా, 9వ తేదీన “తెలంగాణ విజన్-2047” డాక్యుమెంట్ను భారీ ఈవెంట్లో జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో విడుదల చేయనున్నారు. ఉత్సవాలకు ముగింపుగా, డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో అర్జెంటీనా ఫుట్బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సి పాల్గొనే ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించనున్నారు.