HYDRA : హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్…
HYDRA : తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) (HYDRA) జీవో 99ను రద్దు చేయాలంటూ లక్ష్మి అనే మహిళ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది.
- By Sudheer Published Date - 11:23 PM, Fri - 13 September 24

Petition Filed in High Court Against Hydra : చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) (HYDRA) జీవో 99ను రద్దు చేయాలంటూ లక్ష్మి అనే మహిళ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. హైడ్రా (Hydra) ..ఇప్పుడు హైదరాబాద్ (Hyderabad) నగరవ్యాప్తంగా హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ (CM Revanth) ఉక్కుపాదం మోపుతూ..హైడ్రా ను రంగంలోకి దింపారు. నగరంలో జనాభా పెరిగిపోతుండడంతో ఇష్టాను సారంగా చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆక్రమణదారులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది. హైడ్రా రావడంతో నగర పరిధిలో చర్యలు చేపడుతోంది. పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తూ… ప్రభుత్వ స్థలాన్ని అంగులం ఆక్రమించిన తీవ్రంగా ప్రతిఘటిస్తూ హైడ్రా దూసుకెళ్తుంది. ఇప్పటికే వందల ఇల్లు నేలమట్టం చేసింది.
ఇక ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన జీవో 99 చట్టబద్దతను సవాల్ చేస్తూ హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. జీహెచ్ఎంసీ యాక్ట్ కాదని హైడ్రాకు ఎలా అధికారాలు ఇస్తారని … హైడ్రా చట్టబద్దతను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ను జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై ఆగ్రహం చేసింది. వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్పూర్లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూల్చేశారని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చేసినట్లు కోర్టుకు పిటిషనర్ తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
చెరువులు, నాలాల కబ్జాలపై ఫోకస్ చేసిన హైడ్రా.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని ఆక్రమణలను తొలగిస్తూ వస్తుంది. ఇప్పటివరకు 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. దాదాపు 262 అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. తద్వారా 117 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా అమీన్ పూర్ చెరువులో అత్యధికంగా 51 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో 7 ఎకరాలు, 8 ఎకరాల భూములను కూడా స్వాధీనం చేసుకుంది హైడ్రా. ఇక హైడ్రా కూల్చివేతలపై ప్రశంసలే కాదు విమర్శలూ కూడా భారీగానే వస్తున్నాయి. ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అంటున్న అధికారులు.. ఆరోజు వాటి నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అక్రమమే అయినప్పుడు ఇన్నాళ్లు ఎందుకు ట్యాక్సులు కట్టించుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు అధికారుల అనుమతి తీసుకునే నిర్మాణాలు చేపట్టామని, నాడు లేని అభ్యంతరం నేడు ఎందుకు వచ్చిందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే కోర్ట్ లో పిర్యాదులు సైతం చేయడం జరిగింది. మరి ఇప్పుడు కోర్ట్ అక్షింతల ఫై ప్రభుత్వం ఏ సమాధానం చెపుతుందో చూడాలి.
Read Also : Mathu Vadalara 2 : ‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ.. సస్పెన్స్ కామెడీ..