Perni Nani: నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణం.. బాలుడు తండ్రి షాకింగ్ కామెంట్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 14-07-2026 - 9:27 IST
Published By : Hashtagu Telugu Desk
అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ ఇటీవల కన్నుమూసిన హనుమకొండకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. నిరంజన్ను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పడమే కాకుండా.. భవిష్యత్తులో ఓజీ-2 సినిమా కలిసి చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ కోరిక నెరవేరకముందే నిరంజన్ మృతి చెందడం అందరినీ కలచివేసింది. నిరంజన్ మృతితో అతడి కుటుంబమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిరంజన్ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలపై నిరంజన్ తండ్రి ఘాటుగా స్పందించారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పరామర్శపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై నిరంజన్ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో చివరి రోజులు గడుపుతున్న చిన్నారి మనసును దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమని ఆయన అన్నారు. తన బిడ్డ ఆరోగ్య పరిస్థితిని కూడా వెటకారం చేశారని మండిపడ్డారు.
చివరి రోజుల్లో అతని మనసును బాధపెట్టారని.. అలాంటి మాటలు మాట్లాడిన వారికి ఆ పాపం తప్పకుండా చుట్టుకుంటుందని.. దేవుడు అన్నీ చూస్తున్నాడని శాపనార్థాలు పెట్టారు. చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించాల్సిందే అంటూ పేర్ని నానిపై నిరంజన్ తండ్రి తీవ్రస్థాయిలో స్పందించారు.
తన కుమారుడి పరిస్థితిని రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం సరికాదని నిరంజన్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అరుదైన డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (డీఎండీ) వ్యాధితో చాలా కాలంగా పోరాడుతున్న 17 ఏళ్ల పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణించారు. తనను కలవాలనే నిరంజన్ కోరిక తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది జూన్లో హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. అతడి చికిత్సకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కొద్దిసేపు గడిపారు. ఇది కండరాల క్షీణతకు కారణమయ్యే ప్రాణాంతక సమస్య. కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైన నిరంజన్.. ఈనెల 8వ తేదీన చికిత్స పొందుతూ మరణించారు.
నిరంజన్ మరణించడంతో పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఆ బాలుడి చిరునవ్వు ఎప్పటికీ తన మదిలో నిలిచిపోతుందని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు, వాటిపై నిరంజన్ తండ్రి స్పందన ప్రస్తుతం రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై జనసేన, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఆ చిన్నపిల్లాడి ఆరోగ్యం మీద వెటకారం చేసి చివరి రోజుల్లో ఆ పిల్లాడి మనసు బాధ పెట్టిన పేర్ని నాని.. నీకు కచ్చితంగా పాపం చుట్టుకుంటుంది ఇంతకి ఇంత అనుభవిస్తావ్. #YsrcpCriminalParty #Ycp #PerniNani #YsJagan pic.twitter.com/0eU1uZOt00
— Anil U (@UAnil07) July 13, 2026