Duplicates Votes: హైదరాబాద్లో భారీగా నకిలీ ఓట్లు
ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి ఓట్లను యథాతథంగా కొనసాగించడంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 21-10-2023 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
Duplicates Votes: ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి ఓట్లను యథాతథంగా కొనసాగించడంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరణించిన 2.60 లక్షల మంది ఓట్లను తొలగించారు. అయితే ఇక్కడి జాబితాల్లో మృతుల ఓట్లు లక్ష వరకు ఉన్నాయని పార్టీలు చెబుతున్నాయి. నియోజక వర్గాన్ని మార్చుకుని మరోచోట ఓటు నమోదు చేసుకున్న వారికి పాత నివాసంలో ఉన్న ఓటును తొలగించే విషయంపై అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని రాజకీయవర్గాలు వాపోతున్నాయి.
దీంతో నిబంధనల ప్రకారం మరోసారి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఓటరు జాబితాను పరిశీలించకుండానే స్థానిక సంస్థలు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగానే అధికారులు ఓట్లను తొలగించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే 25 వేల డూప్లికేట్ ఓట్లు బయటపడ్డాయి. వీరిలో రెండు నియోజకవర్గాల్లో ఓటు వేసిన వారే ఎక్కువగా ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఒకే నియోజకవర్గంలో ఒకే ఫొటోతో కూడిన ఒకటి కంటే ఎక్కువ ఓట్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో దాదాపు 22 లక్షల ఓట్లు తొలగించారు.
Also Read: world cup 2023: హార్దిక్ స్థానంలో చోటు దక్కేది ఎవరికీ?