Praja Palana: ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న పరమ శివుడు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తుంది. నిన్న శనివారం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియడంతో శనివారం ఒక్కరోజే 1.25 కోట్ల దరఖాస్తులతో రికార్డ్ సృష్టించింది.
- Author : Praveen Aluthuru
Date : 07-01-2024 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
Praja Palana: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తుంది. నిన్న శనివారం దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియడంతో శనివారం ఒక్కరోజే 1.25 కోట్ల దరఖాస్తులతో రికార్డ్ సృష్టించింది. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పథకాల లబ్ది దారుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పది రోజుల పాటు ప్రజాపాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించింది. కాగా శివుడి పేరిట దాఖలైన దరఖాస్తు ప్రస్తుతం ప్రతిఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
తెలంగాణలో ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రజల నుంచి అర్జీలు అందుకుంటుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం రేవంత్ రెడ్డి వినూత్నంగా ముందుకెళుతున్నారు. అంతకుముందు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. పది రోజుల్లో సుమారు కోటీ 24 లక్షల మంది ప్రభుత్వానికి ఆయా పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల కోసం సాక్షాత్తు ఆ పరమశివుడే అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.
హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో శివయ్య పేరు మీద అర్జీ వచ్చింది. శివయ్య కుటుంబ వివరాలు చూస్తే.. దరఖాస్తుదారుడి భార్య పేరు పార్వతి అయితే కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడు అని మెన్షన్ చేశారు. ఇంతటితో ఆగకుండా దరఖాస్తుదారుని ఫొటో దగ్గర శివుడి ఫొటోను అతికించారు. కోట్లాది మంది చేసుకున్న దరఖాస్తుల ఒకలా ఉంటే ఈ వినూత్న దరఖాస్తును చూసి అధికారులు షాకయ్యారు. ఒకటికి రెండు సార్లు ఈ అప్లికేషన్ను పరీక్షించారు. మరో విచిత్రం ఏంటంటే ఆ అప్లికేషన్ను స్వీకరించిన మహిళా అధికారి రశీదు కూడా ఇచ్చారు. అయితే ఇది ఎవరో అనాలోచిత ఆకతాయిలు చేశారా లేక శివుడే వచ్చి ఆరు హామీల కోసం దరఖాస్తు చేసుకున్నాడా అని నెటిజన్లు ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరిన దరఖాస్తులను అధికారులు ఆన్ లైన్ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాప్ట్వేర్ని డిజైన్ చేశారు. ఈ ప్రక్రియను ఈనెల 17న పూర్తి చేయనున్నారు అధికారులు. దరఖాస్తులకు సంబందించిన డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత.. ఆరు గ్యారెంటీల్లోని పథకాల లబ్దిదారులను సర్కారు ఎంపిక చేస్తుంది.
Also Read: Women Stroke: పురుషుల కంటే మహిళలకే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ.. కారణాలివే..?