RTC Driver Suicide : శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్య – KTR
ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా శంకర్ గౌడ్ లాగా తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. చనిపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని ఆయన సూచించారు
- Author : Sudheer
Date : 24-04-2026 - 2:01 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం చెందడంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసుకున్న ఆత్మహత్య కాదని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన “నిర్లక్ష్యపు హత్య” అని ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న ద్రోహాన్ని భరించలేకే శంకర్ గౌడ్ ప్రాణాలు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా వారిని మానసిక వేదనకు గురిచేయడం వల్లే ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోటి రూపాయల పరిహారం
మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ. కోటి ఆర్థిక సహాయం ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మళ్లీ తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఆర్టీసీ సమ్మె రోజులను గుర్తుకు తెస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి వల్లే కార్మికుల్లో అభద్రతాభావం నెలకొందని, ప్రజలకు సేవ చేసే ఆర్టీసీ సిబ్బంది పట్ల ప్రభుత్వం కనీస కనికరం లేకుండా వ్యవహరించడం శోచనీయమని పేర్కొన్నారు. సర్కారు నిర్లక్ష్యం వీడి కార్మికుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఆయన హెచ్చరించారు.
మనోధైర్యం కోల్పోవద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది
ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా శంకర్ గౌడ్ లాగా తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. చనిపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని ఆయన సూచించారు. “మీ హక్కుల కోసం చేసే ప్రతి పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ మీకు కొండంత అండగా ఉంటుంది” అని ఆయన కార్మికులకు భరోసా ఇచ్చారు. చట్టసభల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ ఆర్టీసీ కార్మికుల గొంతుకగా తమ పార్టీ నిలబడుతుందని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగే వరకు విశ్రమించబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.