Jubilee Hills Bypoll Campaign : మూగబోయిన జూబ్లీహిల్స్
Jubilee Hills Bypoll Campaign : హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల హోరాహోరీకి తాత్కాలికంగా తెరపడింది
- Author : Sudheer
Date : 09-11-2025 - 6:33 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల హోరాహోరీకి తాత్కాలికంగా తెరపడింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ బస్తీల్లో, కాలనీల్లో, మార్కెట్ ప్రాంతాల్లో ముఖ్య పార్టీల నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుతూ ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు – బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి – తమ తమ బలమైన ప్రాంతాల్లో చివరి క్షణం వరకు పాదయాత్రలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్లు నిర్వహించారు.
Kumki Elephants Camp : కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోరు మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన ఈ ఉపఎన్నికలో ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సానుభూతి వాతావరణం బీఆర్ఎస్కు తోడవుతుందా, లేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభావం వసూలవుతుందా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు బీజేపీ మాత్రం హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు బలమైన మత రాజకీయ పిచ్ వేసింది. ప్రతి పార్టీ కూడా బస్తీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని విస్తృత స్థాయిలో పాదయాత్రలు, ప్రజా సమావేశాలు నిర్వహించింది.
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఫలితం ఏంటో తెలిసే KCR ప్రచారం చేయలేదు – సీఎం రేవంత్
ఈ నియోజకవర్గంలో 4 లక్షల 1500 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 407 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నవంబర్ 11న పోలింగ్ పూర్తయ్యే వరకు, అలాగే ఓట్ల లెక్కింపు జరిగే నవంబర్ 14న వైన్స్ షాపులు మూసివేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులు గూడకూడదని, ఎలాంటి హడావుడి, క్రాకర్స్ పేల్చడం వంటి చర్యలు నిషేధమని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా బోరబండ, రహ్మత్నగర్ డివిజన్లలో సుమారు 1.10 లక్షల ఓట్లు ఉండటంతో, ఈ రెండు ప్రాంతాల ఓటింగ్ ఫలితమే విజేతను నిర్ణయించనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.