హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం
ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకనే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది. మెుత్తం నాలుగు విడతల్లో ఈ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
- Author : Sudheer
Date : 19-02-2026 - 12:30 IST
Published By : Hashtagu Telugu Desk
Indiramma housing scheme 2nd list : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకనే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది. మెుత్తం నాలుగు విడతల్లో ఈ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున దాదాపు 4 లక్షల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేశారు.
ఇక ప్రజా పాలనలో వచ్చిన అఫ్లికేషన్ల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎల్-1, ఎల్-2 కేటగిరులుగా విభజించి తొలి విడతలో ఎల్-1 లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలు అవుతుండగా.. హైదరాబాద్ నగరం, ఇతర పట్టణాల్లో మాత్రం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటం లేదు. అక్కడ పేదలకు స్థలాలు లేకపోటవంతో పథకం అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని చెప్పారు.
బుధవారం (ఫిబ్రవరి 18) మంత్రి పొన్నం తన ఛాంబర్లో జిల్లాకు చెందిన మరో మంత్రి అజారుద్దీన్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి లబ్ధిదారుల ఎంపిక, డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఎల్1 కింద 4,800 మంది అర్హులైన స్థలాలు ఉన్న పేదలకు నగరంలోనే డబుల్ బెడ్ ఇళ్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఎల్2 కింద జిల్లాలో 4.22 లక్షలకుపైగా దరఖాస్తులు పేదలు అందజేశారని తెలిపారు. మురికివాడల్లోని ప్రజలు నగర శివారు ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్ట పడటం లేదని.. ఇక్కడే ఉపాధి ఉన్నందున వారు కోరుకున్న చోటే స్థలాలు సేకరించి G+5 నుంచి G+10 అంతస్థుల్లో ఇళ్లు నిర్మించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించామని వివరించారు. పెండింగ్ పనులు పూర్తిచేసి మిగతా లబ్ధిదారులకు కూడా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా, మంత్రి ప్రకటనపై హైదరాబాద్ నగరంలోని పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఇండ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.