Heavy Rain : కామారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తిన వాన
Heavy Rain : ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 12 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వరద నీటిలో
- By Sudheer Published Date - 10:53 AM, Thu - 28 August 25

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 12 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వరద నీటిలో మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా భిక్నూర్ టోల్ప్లాజా వద్ద జాతీయ రహదారి 44 బ్లాక్ అవ్వడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం వల్ల రైలు రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి.
Tragedy : కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 14 మంది మృతి
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారి కుంగిపోవడంతో ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి. నిజాంసాగర్ మండలం లక్ష్మాపూర్ సమీపంలోని వాగులో 10 మంది కూలీలు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారు సమీపంలోని నీటి ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినా, వాగులో ఉధృత ప్రవాహం కారణంగా రక్షాకార్యక్రమాలు కష్టతరంగా మారాయి.
పరిస్థితి మరింత దిగజారకుండా కేంద్రం, రాష్ట్రం కలిసి చర్యలు చేపడుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా కలెక్టర్, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమన్వయం చేస్తూ బాధితులకు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. మరోవైపు భారీ వర్షాల ప్రభావంతో అప్పర్ మానేరు డ్యామ్ నీటితో నిండిపోవడంతో వరద ప్రవాహం పెరిగింది. పరిసర ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది.