Dharani portal: ధరణిపై సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ కీలక నిర్ణయాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 18-07-2026 - 10:22 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘ధరణి’ పోర్టల్ భూ రికార్డుల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల భూ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పోర్టల్ వేదికగా జరిగిన భూముల మార్పిడి, నిషేధిత జాబితా మార్పులు, మరియు చేతులు మారిన విలువై న ప్రభుత్వ, ప్రైవేటు భూముల వెనుక ఉన్న అక్రమాలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ ‘సిట్’ పనిచేయనుంది. ఎవరెవరికి లబ్ధి చేకూరింది, చట్ట విరుద్ధంగా ఏ రకమైన రికార్డులు సవరించబడ్డాయి అనే కోణంలో పూర్తి స్థాయి లోతు పరిశీలన జరగనుంది.
ధరణి విచారణతో పాటు రాష్ట్ర ప్రగతికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవాదుల, సీతారామ, అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల అంచనా వ్యయాల (Project Estimates) పెంపునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల నిలిచిపోయిన సాగునీటి పనులు వేగవంతం కానున్నాయి. వీటితో పాటు నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ విద్యాశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతించింది. స్థానిక సంస్థల బలోపేతానికి గానూ గ్రామ పంచాయతీలకు మరింత ఆర్థిక వెసులుబాటు, నిధుల వినియోగ అధికారాలు కల్పిస్తూ క్యాబినెట్ భేటీలో పలు కీలక తీర్మానాలు చేశారు.