Hydra : హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు.. ప్రభుత్వం ఉత్తర్వులు
బడ్జెట్లో హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రూ.50 కోట్లు విడుదల చేయడంతో హైడ్రాకు ఆర్థికంగా మరింత బలం చేకూరనుంది.
- By Latha Suma Published Date - 05:19 PM, Tue - 3 December 24

Hydra: హైదరాబాద్ పరిధిలోని చెరువుల సంరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా ఆఫీసు నిర్వహణ, వాహనాల కొనుగోలు.. కూల్చివేతల చెల్లింపుల కోసం రూ.50 కోట్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బడ్జెట్లో హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రూ.50 కోట్లు విడుదల చేయడంతో హైడ్రాకు ఆర్థికంగా మరింత బలం చేకూరనుంది. హైడ్రాకు నిధుల కేటాయింపుపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్లోని మహేశ్వరం నియోజకవర్గంలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. బడంగ్పేట మున్సిపల్ కార్పోరేషన్లోని అల్మాస్గూడ గ్రామంలో శ్రీవెంకటేశ్వర కాలనీలోని పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన రెడిమేడ్ కంటైనర్ను హైడ్రా అధికారులు తొలగించారు. హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేశ్ ఆధ్వర్యంలో జేసీబీతో తొలగించారు. ఈ విషయంపై కాలనీ వాసులు రెండ్రోజుల కిందట మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్డ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తెచ్చారు.
ఈ విషయం పై అంతకు ముందు కమిషనర్, హైడ్రా, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. హైడ్రా, పోలీస్, మున్సిపల్ ఉన్నతాధికారులతో లక్ష్మారెడ్డి మాట్లాడారు. భూకబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున హైడ్రా, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన కంటైనర్ను ధ్వంసం చేశారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైన పార్కు స్థలాలపై ఫిర్యాదులు అందాయని.. త్వరలో వాటిపైనా చర్యలు తీసుకుంటామని హైడ్రా ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు.
Read Also: Arogya Utsavalu : పదేళ్లు ప్రజా ఆరోగ్యాన్ని బిఆర్ఎస్ గాలికి వదిలేసింది – భట్టి