Election Commission: స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్.. త్వరలో తెలంగాణాలో పర్యటన
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో సహా ఐదు రాష్ట్రాల ప్రతిపాదిత అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆసక్తి చూపిస్తుంది.
- Author : Praveen Aluthuru
Date : 30-08-2023 - 9:14 IST
Published By : Hashtagu Telugu Desk
Election Commission: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో సహా ఐదు రాష్ట్రాల ప్రతిపాదిత అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా ఆసక్తి చూపిస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్, మిజోరాంలలో పర్యటించారు. వచ్చే వారం తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పర్యటించనున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ చివరి వారంలో ఎన్నికల సంఘం ఈ రాష్ట్రాల ఎన్నికలను ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి అన్ని రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను మరికొన్ని రోజులు వాయిదా వేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. ఏది ఏమైనా అక్టోబర్ మొదటి వారంలోనే ఈ రాష్ట్రాలన్నింటిలో ఎన్నికల ప్రకటన వెలువడుతోంది.
2018 సంవత్సరంలో ఈ రాష్ట్రాల ఎన్నికలను అక్టోబర్ 6న ప్రకటించగా 2013 సంవత్సరంలో అక్టోబర్ 4న ప్రకటించింది. అందుకే ఎన్నికలను త్వరగా పూర్తి చేసి సాధారణ ఎన్నికలకు సిద్ధం చేయాలని కమిషన్ ప్రయత్నిస్తోంది. ఎలాగైనా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ముందుకెళ్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 67 శాతం ఓటింగ్ జరగ్గా, ఈసారి దానిని 80 శాతానికి పైగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందువల్ల జాతీయ సగటు కంటే ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం స్పీడ్ చూసి రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను వేగవంతం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పలు పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశాయి. చూస్తుంటే అందరూ ఎన్నికలకు సిద్ధమయ్యారు.
Also Read: Telangana BJP : సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బలం పెరిగిందా? ఆ రెండు సీట్లకు అభ్యర్థులు దొరికినట్టేనా?