Instructions Of CS: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. సీఎస్ కీలక ఆదేశాలు..!
ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
- By Gopichand Published Date - 09:52 PM, Thu - 7 November 24

Instructions Of CS: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Instructions Of CS) ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై నేడు ప్రత్యేకాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా కూడా పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఈ సర్వే కు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ రేపటితో పూర్తవుతుందని, ఈ నెల 9 నుండి అసలు సర్వే మొదలవుతుందని అన్నారు.
ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సేకరించిన వివరాలను కంప్యూటరైజ్ చేయడానికి సుశిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించేల చర్యలు చేపట్టాలని సూచించారు.
Also Read: WPL 2025 Retention: మహిళల ప్రీమియర్ లీగ్.. జట్ల రిటెన్షన్ జాబితా విడుదల!
దేశంలోనే ప్రధమంగా చేపట్టిన ఈ ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియని రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఈ సర్వేలో ప్రతీ ఒక్క కుటుంబం పాల్గొనేలా ప్రతీ రోజూ ప్రజలను ఛైతన్య పర్చేలా విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. ఏ ఇంటినికూడా వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. అలాగే సర్వేలో ఎటువంటి అవకతవకలకు పాల్పడవద్దని ఆమె సూచించారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6వ తేదీ నుంచి కుల గణనకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందుకు తగిన విధంగా అధికారులు ప్రణాళికలు రూపకల్పన చేశారు. నవంబర్ 9 నుంచి అసలు సర్వే మొదలకానుంది. అయితే సర్వే సమయంలో ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటి యజమాని ఉంటే సరిపోతుందని అధికారులు స్పష్టం చేశారు.