Dharmapuri Srinivas : డీఎస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం రేవంత్
రేపు నిజామాబాద్ లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు
- Author : Sudheer
Date : 29-06-2024 - 2:42 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) గుండెపోటుతో ఈరోజు శనివారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. డీఎస్ మరణ వార్త తెలిసి రాజకీయ పార్టీ నేతలంతా తమ సంతాపం వ్యక్తం చేస్తూ..డీఎస్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం డీఎస్ పార్థివ దేహాన్ని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహంలో ఉంచారు. రేపు నిజామాబాద్ లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అలాగే పీసీసీ తరపున పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ పార్థివదేహంపై కాంగ్రెస్ జెండా కప్పాలని నిర్ణయం తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
డీఎస్ మరణ వార్త తెలియగానే సీఎం రేవంత్ తన సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్.. రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Also : Bachchala Malli : రేపే ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేది