CM Revanth : రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్కే ఓటు వేయండి : సీఎం రేవంత్
CM Revanth : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ 400 లోక్సభ సీట్లు కావాలంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
- Author : Pasha
Date : 29-04-2024 - 3:04 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ 400 లోక్సభ సీట్లు కావాలంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజలు రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ దొడ్డమణి కలబురగి (గుల్బర్గా) లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాధాక్రిష్ణ దొడ్డమణికి మద్దతుగా సీఎం రేవంత్ సోమవారం ప్రచారం చేశారు. ఈసందర్భంగా కర్ణాటకలోని గుర్మిట్కల్ జరిగిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ ప్రసంగించారు. ‘‘కలబురగిలో మీరు కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేస్తే.. ముగ్గురు నాయకులు మీకోసం పనిచేస్తారు. ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ను గెలిపించండి’’ అని ఓటర్లను కోరారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన మోడీని ఓడించేందుకు ఓటర్లంతా సిద్ధం కావాలని తెలంగాణ సీఎం కోరారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘కలబురగి నుంచి ఖర్గే తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది’’ అని రేవంత్ (CM Revanth) పేర్కొన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్న విషయాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నామని రేవంత్ తెలిపారు.
Also Read : Akshay Kanti Bam : బీజేపీలో చేరిన కాంగ్రెస్ అభ్యర్థి.. నామినేషన్ విత్డ్రా
‘‘గత పదేళ్లలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పి మోడీ దగా చేశారు. 40కోట్ల మంది జీరో ఖాతాలు తెరిపించుకున్నా.. ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో పడలేదు’’ అని తెలంగాణ సీఎం చెప్పారు. ‘‘26 మంది ఎంపీలను ఇచ్చిన కర్ణాటకకు మోడీ కేవలం ఒక కేబినెట్ పదవిని ఇచ్చి సరిపెట్టారు. మోడీ నుంచి కర్ణాటకకు ఖాళీ చెంబు తప్ప ఇంకేం రాలేదు ’’ అని రేవంత్ మండిపడ్డారు. కరువుతో అల్లాడుతున్న టైంలో బెంగుళూరుకు కనీసం నీళ్లు కూడా మోడీ ఇవ్వలేకపోయారని ఆయన విమర్శించారు.