Cm Revanth: తెలంగాణలో కార్మికులకు భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్
- Author : Vamsi Chowdary Korata
Date : 21-05-2026 - 3:07 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కార్మికుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ వేతనాల పెంపు కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను సీఎం స్వయంగా వివరించారు. ఇక వేతనాల పెంపుతో 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు కేటగిరీలుగా కార్మికులను విభజించి వేతనాలు పెంచినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ వరాల జల్లు కురిపించింది. వారికి అందే కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో తెలంగాణలోని 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయాలను, విధివిధానాలను వివరించారు. ఇక రాష్ట్రంలోని కార్మికులను ప్రభుత్వం మూడు జోన్లుగా విభజించింది. కార్పొరేషన్ల పరిధిలో ఉండే కార్మికులను గ్రేడ్ 1గా, మున్సిపాలిటీ పరిధిలో ఉండే కార్మికులను గ్రేడ్ 2గా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మికులను గ్రేడ్ 3గా పేర్కొంది.
ఇక అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ అంటూ నాలుగు కేటగిరీలుగా కార్మికులను విభజించి వారికి కనీస వేతనాలను పెంచుతున్నట్లు చెప్పారు. జోన్ 1లో కనీస వేతనం ప్రస్తుతం రూ.12,750 ఉండగా.. దానిని రూ.16 వేలకు పెంచారు. ఇక స్కిల్డ్ కార్మికులకు రూ.13,772గా ఉన్న జీతాలను రూ.18,500లకు పెంచారు. ఇక జోన్ 1లో సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13,592 నుంచి రూ.17,000కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేసి చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని కార్మికుల సంక్షేమానికి తమ సర్కారు కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలోని కార్మికులను పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. కార్మికుల కనీస వేతనాలపై సబ్కమిటీని వేసినట్లు చెప్పారు. దీంతో కోటి 11 లక్షల మందికి మేలు జరుగుతుందని వివరించారు.