KCR Reward: కళాకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుగులు!
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు శ్రీ సకిని రామచంద్రయ్యకు
- By Balu J Published Date - 10:11 PM, Tue - 1 February 22

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు శ్రీ సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో సీఎంను ఈ రోజు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా రామచంద్రయ్య కలిసారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సీఎం అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును పొందడం పట్ల సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావును సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ మహమూద్ అలి, శ్రీ మల్లారెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి, శ్రీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శ్రీ తాతామధు, ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ మెత్కు ఆనంద్, శ్రీ గణేశ్ బిగాల, శ్రీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పద్మశ్రీ కనక రాజుకు రివార్డు
గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు శ్రీ కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణం ఖర్చులకోసం ఒక కోటి రూపాయలను సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కును సీఎం ఆదేశించారు.