Telangana Roads: తెలంగాణ లో 4 నేషనల్ హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Telangana Roads: తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో పెద్ద బూస్ట్ లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మించాల్సిన నాలుగు కీలక జాతీయ రహదారులకు NHAI అనుమతులు ఇచ్చి, టెండర్లను ఆహ్వానించడం రాష్ట్ర రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది
- Author : Sudheer
Date : 18-11-2025 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో పెద్ద బూస్ట్ లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మించాల్సిన నాలుగు కీలక జాతీయ రహదారులకు NHAI అనుమతులు ఇచ్చి, టెండర్లను ఆహ్వానించడం రాష్ట్ర రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది. ఆర్మూర్–జగిత్యాల, జగిత్యాల–కరీంనగర్, జగిత్యాల–మంచిర్యాల రహదారులతో పాటు, ఇప్పటికే మహబూబ్నగర్–గూడెబల్లూర్ హైవే టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తం 271 కి.మీ. మేర రహదారులను రూ. 10,034 కోట్ల భారీ వ్యయంతో నిర్మించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి కొత్త దశను ప్రారంభించనుంది. పర్యావరణ, అటవీ, రైల్వే అనుమతులు పూర్తి కావడంతో డిసెంబర్లో టెండర్లు ముగిసిన వెంటనే జనవరి–ఫిబ్రవరిలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నాయి
Saudi Bus Accident: 3 తరాలు బూడిద..ఆ తల్లి ఆవేదన అంత ఇంత కాదు !!
NHAI ప్రతిపాదనలో ఉన్న నాలుగు రహదారులూ తెలంగాణలో ప్రయాణ సౌలభ్యం, పరిశ్రమల అనుసంధానం, వ్యవసాయ వ్యాపార రవాణాకు బాగా దోహదపడే విధంగా రూపొందించబడ్డాయి. మహబూబ్నగర్–గూడెబల్లూర్ 80 కి.మీ. హైవేకు రూ. 2,662 కోట్లు, ఆర్మూర్–జగిత్యాల 64 కి.మీ. రహదారికి రూ. 2,338 కోట్లు, జగిత్యాల–కరీంనగర్ 59 కి.మీ. హైవేకు రూ. 2,484 కోట్లు, జగిత్యాల–మంచిర్యాల 68 కి.మీ. రహదారికి రూ. 2,550 కోట్లు ఖర్చు కాబోతోంది. ఈ నాలుగు రహదారుల కోసం మొత్తం 1,377 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుంది. ఇందులో జగిత్యాల–మంచిర్యాల రహదారిని ఈపీసీ పద్ధతిలో, మిగతా మూడు హైవేలను హ్యామ్ మోడల్లో నిర్మించనుండటం, ప్రాజెక్ట్ పురోగతిని వేగవంతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రాంతీయ వలయ రహదారి (RRR) ఉత్తర భాగ అభివృద్ధి కూడా తెలంగాణ రవాణా రంగానికి మరో పెద్ద పురోగతి. గతంలో 4 లేన్లుగా ప్రతిపాదించిన గిర్మాపూర్–తంగడపల్లి 161 కి.మీ. రహదారిని ఇప్పుడు 6 లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ట్రాఫిక్ సర్వేలు, పెరుగుతున్న వాహనాల రద్దీ, భవిష్యత్ నగరాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేపట్టారు. దీంతో మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 7,104 కోట్ల నుంచి రూ. 15,627 కోట్లకు పెరిగింది. ఇవి పూర్తయితే హైదరాబాద్ శివార్లలో రవాణా రద్దీ తగ్గి, పరిశ్రమలు, నివాస ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. పైగా హ్యామ్ పద్ధతిలో పనులు నిర్వహించడంతో ప్రాజెక్ట్ నాణ్యత, వేగం రెండూ మెరుగుపడే అవకాశం ఉంది.