Telangana BJP: బీజేపీ ప్లాన్ – బి షురూ.. అమిత్ షా వ్యూహం సక్సెస్ అయితే బీఆర్ఎస్కు షాకే!
తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఆ పార్టీకి కమ్మ, బీసీ సామాజిక వర్గాల మద్దతు ఎక్కువే. తెలంగాణలో టీడీపీకి సరియైన నాయకత్వం లేకపోవటంతో ఆ పార్టీ శ్రేణులు ఎక్కువశాతం బీఆర్ఎస్కు ఓటు బ్యాంకుగా ఉన్నారు.
- By News Desk Published Date - 07:55 PM, Wed - 14 June 23
తెలంగాణ (Telangana) లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ (BJP) కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పక్కరాష్ట్రం కర్ణాటక (Karnataka) లో కాంగ్రెస్ (Congress) విజయంతో ఆ ప్రభావం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి ప్రత్యామ్నాయం మేమే అని చెబుతూ వచ్చిన బీజేపీ.. ఎన్నికల సమయంలో డీలా పడుతోంది. దీనికితోడు తెలంగాణ బీజేపీలో వర్గ విబేధాలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగాఉన్న పలు పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఫలితంగా రోజురోజుకు కాంగ్రెస్ బలపడుతుండటంతో బీజేపీ హవా తగ్గుతూ వస్తోంది.
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు బీజేపీలో చేరుతారని ఆ పార్టీ అధిష్టానం భావించింది. ఈ మేరకు వారితో పలుమార్లు చర్చలు జరిపింది. అయితే, కర్ణాటక ఎన్నికల తరువాత పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. పొంగులేటితో పాటు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపుకు లాక్కుందామన్న బీజేపీ ఆశలు సన్నగిల్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై దృష్టిపెట్టిన అమిత్ షా ప్లాన్ -బి సిద్ధం చేసినట్లు తెలంగాణ బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్లాన్ -బి సక్సెస్ అయితే, కేసీఆర్కు కష్టకాలమేనన్న వాదన బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఆ పార్టీకి కమ్మ, బీసీ సామాజిక వర్గాల మద్దతు ఎక్కువే. తెలంగాణలో టీడీపీకి సరియైన నాయకత్వం లేకపోవటంతో ఆ పార్టీ శ్రేణులు ఎక్కువశాతం బీఆర్ఎస్కు ఓటు బ్యాంకుగా ఉన్నారు. అమిత్ షా ప్లాన్ – బి ప్రకారం.. బీఆర్ఎస్ వైపు ఉన్న టీడీపీ సానుభూతి పరులను బీజేపీ వైపుకు మార్చుకోవటమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో అమిత్షా, జేపీ నడ్డాలు టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీ పిలిపించిమరీ చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా చంద్రబాబుసైతం బీజేపీ వ్యూహానికి సై అనడంతో తెలంగాణలో బీజేపీ ప్లాన్ – బి షురూ అయినట్లు తెలుస్తోంది.
అమిత్ షా ఖమ్మంలో బహిరంగ సభను పెట్టడానికి ప్లాన్ – బిలో భాగమేనని సమాచారం. ఖమ్మంలో టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. దీనికితోడు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించనున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతుందని అమిత్ సంకేతాలు ఇస్తారని తెలుస్తోంది. అయితే, దేశంలోని పలు రాష్ట్రాలను గడగడలాడిస్తున్న బిపర్ జూమ్ తుపాను కారణంగా ఖమ్మంలో 15న జరగాల్సిన అమిత్ షా బహిరంగ సభ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని బీజేపీ నేతలు తెలిపారు. అయితే, ఖమ్మం వేదికగానే బహిరంగ సభ ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి బీజేపీ ప్లాన్ -బి పక్కాగా అమలు చేస్తే బీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో గట్టి సవాల్ ఎదురుకాబోతుందన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచిసైతం వ్యక్తమవుతోంది.
Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్లోకి పొంగులేటి బలగం.. భట్టి వర్గంలో టెన్షన్ మొదలైందా?
Tags
Related News
KCR : కేసీఆర్ కాలం చెల్లిన నాయకుడయ్యాడా?
మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకు కేసీఆర్ కేంద్రంగా ఉండేవారు.